చైనా మరో ఐటీ సంస్థపై కత్తి కట్టింది. ఇప్పటికే అలీబాబా, టెన్సెంట్ సంస్థలపై చైనా చర్యలు తీసుకుంది. ఇప్పుడు వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని అక్రమంగా సేకరిస్తున్నారనే ఆరోపణలపై దీదీ గ్లోబల్‌ సంస్థపై కొరడా ఝలిపిస్తోంది న్యూయార్క్‌ స్టాక్‌మార్కెట్లో ఈ దీదీ గ్లోబల్ షేర్ల ట్రేడింగ్ మొదలైన కొద్దిరోజుల్లోనే చైనా ఆ సంస్థపై ఆంక్షలు విధించింది. ఇంతకీ ఈ దీదీ సంస్థ ఏంటంటారా.. ఇది చైనాలో క్యాబ్ సర్వీసులు అందించే సంస్థ.


మన ఇండియాలో ఉబెర్ తరహాలో క్యాబ్ సర్వీసులు అందించే సంస్థ. ఈ రంగంలో ప్రపంచంలోని అతిపెద్ద సంస్థలలో దీదీ ఒకటి. దీదీ సంస్థకు 493 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఈ యూజర్లలో మూడొంతుల మంది చైనాలోనే ఉన్నారు. బీజింగ్ కేంద్రంగా పనిచేసే దీదీ గ్లోబల్.. బ్రెజిల్, మెక్సికో వంటి 14 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. 2016లో దీదీ గ్లోబల్ చైనాలోని ఉబెర్‌ను కొనుగోలు చేసింది. ప్రస్తుతం  దీదీ మార్కెట్  విలువ 74.5 బిలియన్ డాలర్లు.


ఇలా ఎందుకు చేశారంటే.. చైనా ప్రభుత్వం ఇటీవల సైబర్ సెక్యూరిటీ రివ్యూ చేస్తోంది. అందులో భాగంగా ఈ దీదీపై చర్య తీసుకుంటోంది. ఈ సంస్థ నుంచి కొత్త రిజిస్ట్రేషన్లు నిలిపివేసింది. అంతే కాదు.. చైనాకు చెందిన అప్లికేషన్ స్టోర్ల నుంచి దీదీ యాప్ తొలగించాలని చైనా ప్రభుత్వం దీదీ గ్లోబల్‌కు వార్నింగ్ ఇచ్చింది.  వ్యక్తిగత సమాచారాన్ని దీదీ అక్రమంగా సేకరిస్తోందని ఆ డేటాను దుర్వినియోగం చేస్తోందనేది చైనా కంప్లయింట్.


దీదీ వినియోగదారుల అభిరుచులు, ప్రవర్తనల గురించి భారీగా సమాచారం సేకరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది వినియోగదారుల ప్రైవసీకి భంగం కలిగిస్తోందని అంటున్నారు. అయితే చైనా ప్రభుత్వం ఇలా ఐటీ సంస్థలపై వేధింపులకు దిగడం కూడా మంచిది కాదని కొందరు ప్రభుత్వ పెద్దలే అంటున్నారు. ఇప్పటికే చైనా అలీబాబా గ్రూప్‌ హోల్డింగ్‌ సంస్థకు 2.8 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది. చైనా చర్యలతో దీదీ షేర్లు 5.3శాతం కుప్పకూలాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: