మొన్నటివరకు హైదరాబాద్లో డ్రగ్స్ అనే పేరు మారుమోగింది. అయితే ప్రభుత్వం ఆదేశాలతో దానిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. దీంతో డ్రగ్స్ సరఫరాకు కొంతవరకు అడ్డుకట్ట పడినట్లుగా కనిపిస్తోంది. అయితే గంజాయి స్మగ్లింగ్ మాత్రం ఊపందుకుంది. న్యూయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్కు పెద్దఎత్తున గంజాయి సరఫరా జరిగిందని సమాచారం. ఇక న్యూయర్ ముగిసిందో లేదో మరోసారి హైదరాబాద్పై గంజాయి ముఠాలు కన్నేశాయి. పోలీసులకు దొరక్కుండా ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ట్రాన్స్పోర్టు వెహికల్, కారు డోర్లు, బెనేట్లో గంజాయిని ఉంచి స్మగ్లింగ్ చేస్తున్నారు. చివరకు పోలీసుల ముందు కుదేలవుతున్నారు. కాగా, పోలీసులకు పట్టుబడుతున్న గంజాయి స్వల్పమేననీ, ఇంకా దొరక్కుండా స్మగ్లింగ్ అయిన గంజాయి చాలానే ఉంటుందని అంచనా.
తాజాగా రాచకొండ, భువనగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసిన ముఠా.. విశాఖ ఏజెన్సీలో కిలో గంజాయిని రూ.2 వేలకు కొనుగోలు చేసి హైదరాబాద్లో రూ.10 వేలకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. గంజాయిని సులువుగా అమ్మేందుకు రెండు కిలోల చొప్పున ప్యాక్ చేసి విక్రయ ముఠాలకు సరఫరా చేస్తున్నారని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. పట్టుబడిన నిందితుల నుండి మొత్తం రూ. 43 లక్షలు విలువజేసే 294 కిలోల గంజాయి, నగదు, కారు, ఓ ట్రాన్స్ పోర్టు వాహనం, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.