కరోనాకు ముందు తర్వాత అన్నట్లుగా మానవాళిపై విశేషమైన ప్రభవాన్ని చూపుతోంది మహమ్మారి. దీంతో వ్యవస్థ మొత్తం ప్రక్షాళన జరుగుతోంది. కొత్త మార్గాలకు బాటలు వేస్తోంది. పుట్టుక చావుల మధ్య ఉండే మానవాళి జీవన గమనాన్ని కొత్త బాట పట్టిస్తోంది. మూతికి మాస్క్కు తప్పనిసరైంది. అంతేకాదు తప్పనిసరిగా ధరించాల్సిన వస్త్రమైపోయింది. కరోనా సమసిపోయినా జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇకపై మానవాళిని అది అట్టిపెట్టుకునే ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భయానకమైన వైరస్లు భవిష్యత్లు పొంచి ఉంటాయని ఇప్పటి నుంచే శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న వేళ మనిషి మరింత జాగురకతతో బతకాల్సిన ఆవశ్యకత ఏర్పడుతోంది.
ప్రపంచీకరణ వైపు రెక్కలు కట్టుకుని ఎగిరిన మానవాళి ఇప్పుడు గడపదాటేందుకు జక్కే పరిస్థితి. వ్యాక్సిన్ రాక కోసం కోట్లాది కన్నులు ఎదురు చూస్తున్నాయి. అయితే కరోనా మాత్రం మనిషి ప్రతి అడుగులో వెంటాడుతూనే ఉంటుంది. కరోనా మనిషి దృక్కోణాన్ని మార్చేసింది. ఉరుకులు పరుగుల జీవితానికి బ్రేకులు వేసింది. పల్లె నుంచి పట్నం వరకు పరిశుభ్రత, పారిశుధ్యంపై సోయిని పెంచింది. వ్యక్తిగత ఆరోగ్య భద్రతపై అవగాహన పెంచింది. వైద్య పరిశోధనల ఆవశ్యకతను,అవసరాన్ని తెలిపింది. ముఖ్యంగా స్వదేశీ విధానాల డొల్లతనాన్ని, ప్రపంచీకరణ ముసుగులో ఆధారపడటాన్ని వెక్కిరించింది.
అగ్రరాజ్యం నుంచి అతిచిన్న దేశం కూడా కరోనా నుంచి ఎన్నె ఎన్నెన్నో నేర్చుకున్నాయి. ఎన్ని రంగాల్లో ఎంత అభివృద్ధి సాధించినా తినడానికి కాసిన్ని తిండి గింజలు సంపాదించుకోవాలని నేర్పింది. కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఉపద్రవాలు మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పాయి. ప్రాణాంతక పరిస్థితులనుంచి బయటపడి జీవనగతిని మార్చుకునేందుకు దోహదపడ్డాయి. వైద్యరంగ నిపుణులు, ప్రపంచ ఆరోగ్యసంస్థ సీనియర్ అధికారులు సూచిస్తున్నట్లుగా.. ఇప్పడున్న కరోనా మహమ్మారిని ఒకవేళ మనం అనుకున్నదానికంటే ఎక్కువకాలం పాటు ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తితే మనమేం చేయాలి? మార్పుతో కూడిన బాధ్యతాయుతమైన జీవన విధానమే దీనికి ఏకైక సమాధానం.
హెచ్ఐవీ వంటి వ్యాధులు మానవాళిని చాలాకాలం పీడించాయి. ఇప్పటివరకు చాలా ప్రాణాంతక వ్యాధులకు వ్యాక్సిన్లు కూడా రాలేదు. కానీ ప్రజలు తమ అలవాట్లను మార్చుకోవడం వల్ల వీటిని ఎదుర్కొని జీవిస్తున్నారనే విషయాన్ని గమనించాలి.