ఎపి నయా ఆఫర్
బాలికల జనాభా తగ్గరాదనే ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వం లింగ నిర్దారణ పరీక్షలు చేయడాన్ని నిషే ధించింది. గర్భిణులకు అవసరైన పక్షంలో ఆరోగ్య పరీక్షలు మాత్రమే చేయాలని చూచించింది. అయినా ఎక్కడో ఒక చోట లింగ నిర్దారణ పరీక్షలు జరుగుతున్నాయి. దీనిని సమూలంగా అరికట్టేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. సమాచరం అందిస్తే బహుమతులు అంజేస్తామని తెలిపింది.
ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తాజా గా ఈ విషయాన్ని ప్రకటించారు. లింగనిర్దారణ పరీక్షలు చేసే స్కానింగ్ కేంద్రాలు, వైద్యుల పేర్లు ప్రభుత్వానికి తెలపాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
కుటుంబ నేపథ్యం, సామాజిక, ఆర్థిక అవసరాల రీత్యా కొన్ని ప్రాంతాలలో బాలికలపై కొంత చిన్న చూపు ఉందని, దానిని రూపు మాపాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. బాలికలు ఎవరికి కూడా, ఎన్నటికీ భారం కారనే విషయాన్ని అందరూ గ్రహించాలని కోరారు. లింగ నిర్దారణ పరీక్షలు చేసిన వారికి తొలిసారి పది వేల రూపాయల జరిమానాతో పాటు, జైలు శిక్ష విధిస్తారని తెలిపారు. రెండో సారి ఈ తప్పు చేస్తే శిక్ష మరింత కఠినంగా ఉంటుందని చెప్పారు. గ్రామాలలో వైద్య సేవలు అందిస్తున్న ఆశ కార్యకర్తలు, అంగన్ వాడీ కార్యకర్తలు , ప్రజా సంఘాలు బాలిక జనాభాపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య పరిక్షలు ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసిన కేంద్రాల లోనే జరిగేటట్టు చూడాలని కోరారు. ప్రజలకు న్యాయం జరిగేందుకు ప్రతి జిల్లాలోనూ లీగల్ క్లినిక్ లను ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వైద్య పరీక్షా కేంద్రం వద్ద లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్నట్లు కేసు నమోదు అయితే సమాచారం ఇచ్చిన వారికి ఇరవై ఐదు వేల రూపాయలు బహుమానంగా ఇస్తామని ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. సదురు కేంద్రానికి శిక్ష ఖరారైతే లక్ష రూపాయలు ఫిర్యాదు చేసిన వ్యక్తికి బహుమానంగా ఇస్తామని తెలిపింది. లింగ నిర్దారణ చేస్తున్న పరీక్షా కేంద్రాల పేర్లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఫాక్స్ రూపంలో కాని, ఫిర్యాదు రూపంలో కాని తెలపాలని కోరింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వెబ్ సైట్ లోనూ ఫిర్యాదు చేయవచ్చని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.