ప్రగతి పథంలో దూసుకుపోతున్న హైదరాబాద్‌కు అనేక కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. ప్రజల సౌకర్యం కోసం మరిన్ని మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. ఇప్పటికే రెండు లైన్లలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాక ప్రజలు చాలా సౌకర్యంగా ఫీలవుతున్నారు. అయితే.. మెట్రో లైన్‌లో లేని కొన్ని మార్గాల్లోనూ మెట్రో తరహా సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్‌ నుంచి కోకాపేట నియో పోలీస్‌ వరకు 22 కి.మీ. మెట్రో నియో ప్రాజెక్టును చేపట్టబోతున్నారు.


ఈ మెట్రో నియో ప్రాజెక్టును పీపీపీ పద్దతిలో రూపొందిస్తారు. మెట్రో నియో అంటే.. ఈబీఆర్‌టీఎస్‌- ఎలివేటెడ్‌ బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ అన్నమాట.. అంటే మెట్రో తరహాలోనే ఉంటుంది. కానీ.. రైల్‌ కోచ్‌లకు బదులుగా ఎలక్ట్రిక్ బస్‌ కోచ్‌లు ఉంటాయన్నమాట. ఈ ప్రాజెక్టుకు  రూ.2500 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సరికొత్త ప్రాజెక్టును హెచ్‌ఎండీఏ..   హైబ్రీడ్‌ యాన్యుటీ మోడల్‌ పద్ధతిలో చేపట్టనుంది. దీనికి హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో తోడ్పాటు అందిస్తుంది. టీఎస్‌ఐఐసీ కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం అవుతుంది.


ఈ మెట్రో నియోకు సంబంధించిన వివరాలు చూస్తే.. ఇది కూడా అచ్చం మెట్రో మాదిరే ఉంటుందని చెబుతున్నారు. దీనికి కూడా ఎలివేటెడ్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తారు. అందులో మెట్రో కోచ్‌ల స్థానంలో ఎలక్ట్రిక్‌ బస్సులు ఉంటాయి. మెట్రో తరహాలోనే ఈ ఎలక్ట్రిక్ బస్సులను కూడా  అత్యాధునిక హంగులతో రూపొందిస్తారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ కు సంబంధించిన సమగ్ర నివేదిక సిద్ధమైంది. హెచ్‌ఎండీఏ అధికారులు రూపొందించిన ఈ నివేదను ప్రభుత్వం పరిశీలిస్తోంది.


ఇది కూడా సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి వస్తే.. కూకట్ పల్లి - కోకా పేట మధ్య రాకపోకలు మరింత సులువు అవుతాయి.  ఆ ట్రయాంగిల్ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్‌, మెట్రో సేవలతో హైదరాబాద్‌ రూపు రేఖలు చాలా వరకూ మారిపోయాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: