నేటి టాలీవుడ్ ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ కి వస్తే.. 'కమర్షియల్ క్లాసిక్ డైరెక్టర్' కొరటాల శివ - మెగాస్టార్ చిరంజీవి కలయికలో వస్తున్న 'ఆచార్య' సినిమా నిర్మాణ కార్యక్రమాలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. అయితే, అక్టోబర్ 1న ఈ సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. మెగాస్టార్ పుట్టినరోజు నాడు అనగా ఆగస్టు 22న 'ఆచార్య' విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇక తన నిశ్చితార్థం రద్దు అయ్యాక, మెహ్రీన్ మళ్ళీ హీరోయిన్ గా బిజీ కావడానికి ప్రత్యేక పీఆర్వో టీమ్ ను పెట్టుకుంది. వారి సహకారంతో వివిధ భాషలలో వచ్చిన ప్రతి సినిమాకి సైన్ చేస్తూ పోతుంది. ఈ క్రమంలో కెరీర్ లోనే మొదటిసారి ఓ కన్నడ చిత్రంలో కూడా నటించబోతుంది. శివరాజ్ కుమార్ హీరోగా రానున్న ఓ సినిమాలో మెహ్రీన్ కథానాయికగా ఎంపిక అయింది.
కన్నడ డైరెక్టర్ రామ్ ధూళిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ 'సిగువరేగు'. ఇక మరోపక్క, తెలుగులో ప్రస్తుతం మెహ్రీన్ హీరోయిన్ గా నాలుగు సినిమాలు చేస్తుండటం విశేషం.
లేడీ సూపర్ స్టార్ నయనతార మరో మలయాళ సినిమాని అంగీకరించింది. 'ప్రేమమ్' లాంటి క్లాసిక్ సినిమాని అందించిన దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రేన్ డైరెక్షన్ లో పృథ్వీరాజ్ హీరోగా రానున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్. పెళ్ళికి ముందు ఇదే ఆమెకు చివరి సినిమా కానుంది.
బాలయ్య - గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం షూటింగ్ అక్టోబర్ 1వ తేదీ నుండి మొదలు కానుంది. ఈ సినిమాకి సంబంధించి రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ ప్రత్యేక సెట్ కూడా వేస్తున్నారు. మొదటి షెడ్యూల్ ఆ సెట్ లోనే షూట్ చేయనున్నారు.
దర్శకుడు మేర్లపాక గాంధీ - నితిన్ కలయికలో రానున్న 'మాస్ట్రో' సినిమాను 'డిస్నీ హాట్ స్టార్' వారు 32 కోట్లకు కొన్నారని తెలుస్తోంది. 'వినాయకచవితి' కానుకగా వచ్చే నెల 10వ తేదీన ఈ చిత్రం ప్రసారం కానుంది.