ఇక ఈ నెలలో కోలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ముగ్గురు లెజెండరీ డైరెక్టర్లు బాక్సాఫీస్ పరీక్షకు రెడీ అయ్యారు. ఆ ముగ్గురే మణిరత్నం, గౌతమ్ మీనన్, సెల్వ రాఘవన్.వీరిలో మణిరత్నం, సెల్వ రాఘవన్ నెలాఖర్లో పొన్నియన్ సెల్వన్, నానే వరువేన్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు చాలా గ్రాండ్ గా రాబోతున్నారు.అయితే మరో స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ వీరి కంటే రెండు వారాల ముందే తన సినిమాను థియేటర్లలోకి దించేశాడు. ఆ చిత్రమే.. వెందు తనిందద కాడు. గౌతమ్ టాలెంట్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే అజిత్ హీరోగా తీసిన ఎన్నై అరిందాల్ (తెలుగులో ఎంతవాడుగాని) తర్వాత ఆయనకు విజయం లేదు. గౌతమ్ తన స్థాయికి తగ్గ సినిమాలు తీయకపోవడం ఒక సమస్య అయితే.. ఫైనాన్షియర్లతో గొడవలు కూడా ఆయన సినిమాలపై ప్రతికూల ప్రభావం చూపాయి. అందువల్ల గౌతమ్ సినిమాలు కొన్ని మధ్యలో ఆగిపోయాయి కూడా.ఐతే అడ్డంకులన్నీ అధిగమించి శింబు హీరోగా గౌతమ్ తీసిన వెంతు తనిందద కాడు ఎట్టకేలకు గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


శింబు ఇందులో ఒక కాటి కాపరి స్థాయి నుంచి గ్యాంగ్‌స్టర్‌గా మారే పాత్రను పోషించడం విశేషం. ఈ చిత్రానికి అదిరిపోయే టాక్ వస్తోంది. అందరూ దీన్ని బ్లాక్‌బస్టర్ అని ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నారు.గౌతమ్ మళ్లీ కాక్క కాక్క రోజులను గుర్తు చేస్తూ దర్శకుడిగా గొప్ప పనితనం చూపించాడని, శింబు కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడని, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అదుర్స్ అని సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. తమిళ క్రిటిక్స్, ప్రేక్షకులు ఈ మధ్య మామూలు సినిమాలకు కూడా ఎక్కువ ఎలివేషన్ ఇస్తున్న మాట వాస్తవమే అయినా.. గౌతమ్-శింబు సినిమాకు మాత్రం ఎక్కడా నెగెటివ్ టాక్ అన్నదే కనిపించడం లేదు. సినిమా కచ్చితంగా పెద్ద హిట్టయ్యేలాగే కనిపిస్తోంది. ఈ చిత్రం తెలుగులో ది లైఫ్ ఆఫ్ ముత్తు పేరుతో గురువారమే రిలీజ్ కావాల్సింది. కానీ ఏవో టెక్నికల్ ఇష్యూస్ వల్ల శనివారానికి వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: