గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఏకధాటిగా వినిపిస్తున్న పేరు శివాజీ. ఆయన నటించిన ‘దండోరా’ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా స్టేజ్‌పై మాట్లాడిన మాటలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున విమర్శలకు, ఆగ్రహానికి దారి తీశాయి.ఆ ఈవెంట్‌లో శివాజీ మాట్లాడుతూ, మహిళల ప్రైవేట్ భాగాలను సామాన్లతో పోల్చినట్లుగా వ్యాఖ్యలు చేయడం, అలాగే మహిళలు చీర తప్ప ఇతర దుస్తులు ధరిస్తే బాగుండదన్న భావన వచ్చేలా మాట్లాడడం తీవ్ర దుమారం రేపింది. “చీర కట్టుకుంటే మహిళలు మహాలక్ష్మిలా కనిపిస్తారు, కానీ చీర కాకుండా ఇతర దుస్తులు వేసుకుంటే బయటకు నవీనంగా కనిపించినా లోపల దరిద్రంగా ఉంటారు” అన్న తరహా మాటలు స్టేజ్‌పై ఓపెన్‌గా చెప్పడం అనేక మందిని షాక్‌కు గురిచేసింది.

ఈ వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు మొదలయ్యాయి. పలువురు హీరోయిన్లు, మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఈ వ్యాఖ్యలను ఖండించారు. మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ శివాజీపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని కూడా కొందరు హెచ్చరించారు. ఈ మొత్తం వ్యవహారం టాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియా వేదికగా పెద్ద హీట్‌ను క్రియేట్ చేసింది.

ఈ పరిస్థితుల్లో శివాజీ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా అయినా ఆయన సమస్యను సాఫీగా పరిష్కరిస్తారు, క్షమాపణ చెబుతారు అని చాలామంది ఆశించారు. కానీ పరిస్థితి మరింత ముదిరిపోయేలా ఆయన మాట్లాడిన మాటలు కొత్త వివాదానికి దారి తీశాయి. తాను మొత్తం పాజిటివ్‌గా మాట్లాడానని, కేవలం రెండు తప్పు మాటలే మాట్లాడానని, ఆ రెండు మాటలకే ఇంత పెద్ద రాద్దాంతం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. “ఆ రెండు మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది” అని ఒప్పుకున్నప్పటికీ, పూర్తి స్థాయి క్షమాపణ చెప్పకుండా విషయాన్ని తేలికగా తీసుకున్నట్టు అనిపించే విధంగా మాట్లాడడం విమర్శలకు కారణమైంది.

అంతేకాదు, ఈ వ్యవహారంలోకి అనసూయ ఎందుకు వచ్చిందని, ఆమె ఎందుకు అంత ఘాటుగా రియాక్ట్ అయ్యిందన్నట్లు శివాజీ మాట్లాడిన తీరు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. చిన్మయి పై సాఫ్ట్‌గా రియాక్ట్ అయిన శివాజీ, అనసూయ విషయంలో మాత్రం “మీకు అంతకు అంత ఇచ్చి పడేస్తా” అన్న రేంజ్‌లో ఘాటుగా స్పందించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.ఇదే సమయంలో శివాజీ వ్యాఖ్యలకు వెంటనే అనసూయ కూడా స్పందించారు. ఆమె ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి, “నీ అవసరం నాకు ఎప్పటికీ అవసరం లేదు” అంటూ శివాజీ మాటలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అనసూయ స్పందన కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది.

ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తున్న నెటిజన్లు, శివాజీ తన తప్పును అంగీకరించి క్షమాపణ చెప్పాల్సిన చోట, అనసూయను టార్గెట్ చేసి మాట్లాడినట్టు ఉందని అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యల కంటే, ఇప్పుడు అనసూయపై చేసిన కామెంట్లు ఇంకా ఎక్కువగా వివాదాన్ని క్రియేట్ చేస్తున్నాయని పలువురు అంటున్నారు.ఫలితంగా శివాజీ పేరు సోషల్ మీడియాలో మరింత ట్రోలింగ్‌కు గురవుతోంది. “ఉన్న సమస్యను సరిగా పరిష్కరించుకోకుండా కొత్త సమస్యను క్రియేట్ చేసుకున్నాడు” అన్న కామెంట్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మహిళా సంఘాలు కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, శివాజీని వదలమని స్పష్టంగా చెబుతూ సోషల్ మీడియాలో గట్టిగా స్పందిస్తున్నాయి.

మొత్తానికి, శివాజీ చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత ప్రెస్ మీట్‌లో తీసుకున్న వైఖరి, అలాగే అనసూయతో జరిగిన మాటల యుద్ధం—ఈ మూడు కలిసి ఈ వివాదాన్ని మరింత పెద్దదిగా మార్చేశాయి. ఈ విషయం ఎటువైపు మలుపు తిరుగుతుందో, లీగల్‌గా ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్నది ఇప్పుడు అందరి ఆసక్తిగా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: