- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో ‘టెంపర్’ ఒక కీలక మలుపు. అక్కడి నుండి వరుస విజయాలతో దూసుకుపోతున్న తారక్, గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. అయితే, ఆయన బాలీవుడ్ అరంగేట్రం చేసిన ‘వార్-2’  ఫలితం మాత్రం అభిమానులను కొంత నిరాశకు గురిచేసింది. ఈ సినిమా పంపిణీకి సంబంధించి నిర్మాత నాగవంశీ భారీగా నష్టపోయారని, ఆస్తులు కూడా అమ్ముకున్నారంటూ జరిగిన ప్రచారంపై ఆయన తాజాగా స్వయంగా వివరణ ఇచ్చారు.


‘వార్-2’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీ ధరకు కొనుగోలు చేసిన నాగవంశీ, సినిమా డిజాస్టర్ అవ్వడంతో దాదాపు రూ. 80 కోట్లు నష్టపోయారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన స్పందిస్తూ, వాస్తవ గణాంకాలను బయటపెట్టారు. జీఎస్టీ కాకుండా ఈ సినిమాను రూ. 68 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం సుమారు రూ. 35 నుంచి 40 కోట్ల షేర్ వసూలు చేసింది. సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో, బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ నాగ‌వంశీని ఆదుకున్నారు. ఒప్పందం ప్రకారం, వారు తమంతట తామే ముందుకొచ్చి నాగవంశీకి రూ. 18 కోట్లు వెనక్కి ఇచ్చారు. దీనివల్ల ఆయనకు జరిగిన నికర నష్టం కేవలం రూ. 10  కోట్లు మాత్ర‌మే.


‘వార్-2’ ఫలితం ఎలా ఉన్నా, ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం ‘డ్రాగన్’ (ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో) పై పూర్తి దృష్టి సారించారు. ‘దేవర’ సాధించిన భారీ వసూళ్లు తారక్ మాస్ పవర్‌ను నిరూపించగా, ఇప్పుడు ప్రశాంత్ నీల్ మేకింగ్‌లో రాబోతున్న సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయాలని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సినిమా పరిశ్రమలో లాభనష్టాలు సహజమని, ముఖ్యంగా పెద్ద సినిమాల పంపిణీలో ఇటువంటి రిస్క్‌లు ఉంటాయని నాగవంశీ వ్యాఖ్యానించారు. తారక్‌తో ఆయనకు ఉన్న అనుబంధం కారణంగానే ఈ సినిమాను ధైర్యంగా పంపిణీ చేశానని, కేవలం ఒక సినిమా ఫలితంతో సంబంధాలు మారిపోవని ఆయన పునరుద్ఘాటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: