సినిమా రంగం అనేది నిరంతరం కొత్త ఆలోచనలు, కొత్త ప్రతిభతో ఉరకలెత్తే ఒక ప్రవాహం. 2025 సంవత్సరం టాలీవుడ్‌లో కొత్త ద‌ర్శ‌కుల సంవ‌త్స‌రంగా నిలిచిపోయింది. పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నా, చిన్న సినిమాలతో వచ్చి సంచలనాలు సృష్టించిన యువ దర్శకులు ఇండస్ట్రీకి కొత్త ఆశలు చిగురింపజేశారు. ఈ ఏడాది మెరిసిన ఆ నవ దర్శకులపై ఒక ప్రత్యేక విశ్లేషణ.


సాయి మార్తాండ్: 'లిటిల్ హార్ట్స్' సంచలనం :
ఈ ఏడాది అత్యంత ప్రభావం చూపిన దర్శకుడు సాయి మార్తాండ్. కేవలం 3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన 'లిటిల్ హార్ట్స్' సినిమా ఏకంగా 30 కోట్ల వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలకు పెద్ద షాక్ ఇచ్చింది. పది రెట్లు లాభాలు తెచ్చిపెట్టడంతో సాయి మార్తాండ్‌కు ఇండస్ట్రీలో భారీ క్రేజ్ ఏర్పడింది. సీనియర్ నటుడు జగపతిబాబు ఈయన ప్రతిభకు ముగ్ధుడై తన సొంత బ్యానర్ 'జగపతి ఆర్ట్స్' కోసం అడ్వాన్స్ ఇచ్చారు. తదుపరి సినిమా నితిన్‌తో ఉండే అవకాశం ఉందని సమాచారం.


జగదీష్: 'కోర్ట్'తో బలమైన ముద్ర :
నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో వచ్చిన 'కోర్ట్' సినిమా ద్వారా దర్శకుడు జగదీష్ తన ముద్ర వేశారు. ఈ సినిమా కోర్టు రూమ్ డ్రామా అయినప్పటికీ, కమర్షియల్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి జగదీష్ నడిపించిన తీరుకు ప్రశంసలు దక్కాయి. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిన్న సినిమాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఈ దర్శకుడు నాని హీరోగా ఒక కొత్త స్క్రిప్ట్‌పై పని చేస్తున్నట్లు తెలుస్తోంది.


ధనరాజ్: నటుడి నుంచి దర్శకుడిగా..
హాస్యనటుడిగా గుర్తింపు పొందిన ధనరాజ్, ఈ ఏడాది 'రామం - రాఘవం' చిత్రంతో మెగాఫోన్ పట్టారు. ద్విభాషా చిత్రంగా వచ్చిన ఈ మూవీతో దర్శకుడిగా ఆయన మంచి మార్కులు కొట్టేశారు. ఎమోషన్స్ పండించడంలో ధనరాజ్ సఫలమవడంతో, ఆయన రెండో ప్రాజెక్ట్ కోసం పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
రాహుల్ శ్రీనివాస్: 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'
ఫీల్ గుడ్ ఎమోషన్స్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగిన 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' దర్శకుడు రాహుల్ శ్రీనివాస్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఒక చిన్న పాయింట్‌ను తీసుకుని రెండు గంటల పాటు ప్రేక్షకులను బోర్ కొట్టించకుండా నడిపించడం ఈయనలోని నేర్పుకు నిదర్శనం. ప్రస్తుతం ఒక క్రేజీ యువ హీరోతో రాహుల్ తన తదుపరి సినిమాకు సిద్ధమవుతున్నారు.


సంవత్సరం చివర్లో వచ్చిన కొన్ని సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. రాజు వెడ్స్ రాంబాయి, దండోరా సినిమాల‌ దర్శకులు కూడా తమ తొలి ప్రయత్నంలోనే సత్తా చాటారు.
శంబాల: ఈ సినిమాతో ఆది సాయికుమార్‌కు చాలా కాలం తర్వాత ఒక హిట్ దక్కింది. ఈ దర్శకుడి మేకింగ్ స్టైల్ బడా నిర్మాణ సంస్థల దృష్టిని ఆకర్షించింది. 2025లో తామేంటో నిరూపించుకున్న ఈ యువ దర్శకులు, 2026లో తమ తదుపరి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: