‘ఆర్ ఎక్స్ 100 ’ ఫేమ్ కార్తికేయ యూత్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన హిప్పీ సినిమా అందరిని నిరాశ పరిచింది. బోయపాటి శ్రీను శిష్యుడు అర్జున్ జంధ్యాల దర్శకుడిగా కార్తికేయ హీరోగా రాబోతున్న చిత్రం `గుణ 369`. అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు 2న విడుదల కాబోతుంది. బోయపాటి శిష్యుడు ఈ సినిమాకు దర్శకుడు కావడంతో ఈ కథను అద్భుతంగా తయారు చేసి ఉంటాడని భావించారు. ఈ సినిమా అంచనాలు కూడా బాగానే ఉన్నాయి.
అయితే ఈ సినిమాలో కమెడియన్ మహేష్ హీరో స్నేహితుడిగా కనిపించబోతున్నాడట. ట్విస్ట్ ఏంటంటే కీలకమైన విలన్లలో మహేశ్ ఒకటిగా ఉంటాడని... ఈ రోల్ చాలా షాకింగ్ గా ఉంటుందని సమాచారం. నిజానికి చిన్న చిన్న వేషాలతో మొదలు పెట్టిన మహేష్ శతమానం భవతిలో తన యాక్సెంట్ తో అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత రంగస్థలంలో చరణ్ అసిస్టెంట్ గా చేశాక ఇక అదే స్టాయిలో దూసుకుపోతున్నాడు. మహేష్ ఇటీవలే వంద సినిమా మార్కును చేరుకున్నాడు.
ఇక `గుణ 369` సినిమాతో అందరికి మంచి బ్రేక్ వస్తుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మహేష్ విలన్ రోల్ ప్రేక్షకులకు ముందుగానే రివీల్ అయినా స్టోరీ వేగంగా ఉండడం వల్ల ఊహించని విధంగా ట్విస్టులు ఉంటాయని తెలుస్తోంది. ఇక సినిమాకు కీలకమైన విలన్ మహేష్ రోల్ గురించి యూనిట్ ఎక్కడా ప్రస్తావించలేదు కానీ... ఈ క్యారెక్టర్ సినిమాకే హైలెట్ అన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది.
శుక్రవారం విడుదల కాబోయే ఈ సినిమాకు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాక్షసుడు ఒక్కటే పోటీలో ఉంది. ఇక ఈ సినిమాలో హీరో కార్తికేయ క్యారక్టరైజేషన్ ‘ఆర్ ఎక్స్ 100’, ‘హిప్పీ’ కన్నా చాలా విభిన్నంగా ఉంటుంది’ అని తెలుస్తోంది. ఈ సినిమా కార్తికేయకు ఎంత వరకు హిట్ ఇస్తుందో చూడాలి.