ఉత్తరాధి పైనే... ప్రత్యేక దృష్టి పెట్టిన భారతీయ జనతా పార్టీ... దక్షిణాదిలోనే పాగా వేసేందుకు ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తూనే ఉంది. చివరికి ప్రాంతీయ పార్టీలతో పొత్తు కూడా పెట్టుకుంది. అలా చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో అలయన్స్‌లో ఓ నాలుగేళ్ల పాటు అధికారం అనుభవించినప్పటికీ... ఆ తర్వాత మళ్లీ పదవుల కోసం పోరాటం చేస్తోంది. దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో ఇప్పుడు కేవలం కర్ణాటకలో మాత్రమే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. కానీ... మిగిలిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఆధిపత్యం కోసం పాకులాడుతూనే ఉంది. ఆయా ప్రభుత్వాలపై ఎన్ని యుద్ధాలు చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది. చివరికి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసిన కమలం పార్టీ.... కనీసం బోణీ కూడా కొట్టలేకపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే... మరీ ఘోర పరాజయమనే చెప్పాలి. కనీసం ఒక్కటంటే ఒక్కచోట కూడా ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్ కూడా దక్కలేదు.

ఇక కేరళ రాష్ట్రంలో కూడా బీజేపీ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 113 స్థానాల్లో పోటీ చేసిన కాషాయ పార్టీ... సున్నా దగ్గరే ఆగిపోయింది. చివరికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెట్రో మ్యాన్‌ను ముందుగానే ప్రకటించింది. అయినా సరే... ఆయన కూడా విజయం సాధించలేదు. ఇక 2021 ఏప్రిల్ నెలలో జరిగిన తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నాటి అధికార అన్నాడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుంది. అమిషా వంటి నేతలు ప్రచారం కూడా చేశారు. పొత్తులో భాగంగా 20 స్థానాల్లో పోటీ చేశారు కమలం పార్టీల అభ్యర్థులు. అందులో కేవలం నాలుగే స్థానాలతో సరిపెట్టుకుంది. అది కూడా అన్నాడీఎంకే పొత్తు వల్ల మాత్రమే అని రాజకీయ విశ్లేషకులు వెల్లడించారు. ఇక అధికారమే లక్ష్యంగా 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ... చివరికి కేవలం ఒక్కటంటే ఒక్కటే సీటు సాధించింది. మొత్తం 117 నియోజకవర్గాల్లో అభ్యర్థులు పోటీ చేయగా... కేవలం రాజాసింగ్ మాత్రమే విజయం సాధించారు. చివరికి కిషన్ రెడ్డి లాంటి బడా నేతలు కూడా ఓడిపోయారు. నాలుగు రాష్ట్రాల్లో మొత్తం 407 స్థానాల్లో పోటీ చేసిన కమలం పార్టీ కేవలం 5 చోట్ల మాత్రం గెలిచింది. పరిస్థితి ఇలాగే ఉంటే... కమలం పార్టీ అధికారంలోకి ఎలా వస్తుందో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి:

bjp