![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/editorial/77/pawan-kalyan8f851a97-4273-40a4-9b85-2b7a330d3bb6-415x250.jpg)
ఎందుకో తెలియదుకానీ జగన్మోహన్ రెడ్డి అంటే పవన్ కల్యాణ్ లో రోజురోజుకు అక్కసు పెరిగిపోతోంది. జగన్ను తలచుకుంటే బహుశా ఒంటికి కారం రాసుకున్నట్లు ఫీలవుతారేమో. లేకపోతే సమయం, సందర్భం ఏమీ లేకుండానే జగన్ కు వ్యతిరేకంగా బుర్రకు తోచింది ట్విట్టర్లో పోస్టుచేస్తారా ? పార్టీ మీటింగ్ పెట్టినా, బహిరంగసభ నిర్వహించినా జగన్ను తిట్టందే, జగన్ పై అక్కసు వెళ్ళగక్కనిదే పవన్ స్పీచ్ ముగియదు.
ఇపుడు విషయం ఏమిటంటే మూడురోజుల క్రితం గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతం వినుకొండలో జగన్ మాట్లాడుతు ఏపీలో జరుగుతున్నది క్యాస్ట్ వార్ కాదని క్లాస్ వారన్నారు. పేదలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధమని అన్నారు. దానికి హఠాత్తుగా బుధవారం మేల్కోన్న పవన్ ట్విట్టర్లో వరసు ట్వీట్లతో జగన్ పై రెచ్చిపోయారు. సంబంధమే లేకుండా దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి పాలనలో అత్యంత పేద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉందన్నారు.
అలాగే దేశంలోనే సీఎం జగన్ క్లాస్ వేరని ఎద్దేవాచేశారు. ఆక్సీమోరాన్-అంటే పరస్పర విరుద్ధమైన పదాల కలయికగా చెబుతు అత్యంత ధనిక ముఖ్యమంత్రి జగన్ పాలనలో అత్యంత పేద రాష్ట్రం ఏపీ అన్నారు. మన సీఎం సంపాదన దేశంలోని మిగిలిన సీఎంలందరి సంపాదన కన్నా చాలా ఎక్కువంటు ట్వీట్ చేశారు. వైసీపీ పాలనలో ప్రజలందరినీ బానిసలుగా మార్చుకున్నారంటు మండిపడ్డారు.
భూమి నుండి ఇసుకవరకు, మద్యం నుండి గనుల వరకు, అడవుల నుండి కొండల వరకు, కాగితం నుండి ఎర్రచందనం వరకు ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చే ప్రతి పైసా ధనిక ముఖ్యమంత్రి జగన్ చేతిలోనే ఉంది అని చెప్పటమే విచిత్రంగా ఉంది. జగన్ పైన తనకున్న అక్కసునంతా వరుస ట్వీట్లలో పవన్ బయటపెట్టుకున్నారు. నిజానికి ఇలాంటి ట్వీట్లు పవన్ కు కొత్తకాదు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తునే ఉన్నారు. కాకపోతే జగన్ సీఎం అయిన తర్వాత చాలా ఎక్కువయ్యాయంతే. తనను రెండుచోట్లా వైసీపీ ఓడించిందనే మంట పవన్లో బాగా పేరుకుపోయినట్లుంది. అందుకనే జగన్ అంటే సమయం, సందర్భంలేకుండా రెచ్చిపోయేంతగా మండిపోతున్నారు.