ఏపీ సీఎం చంద్రబాబు అంతటి రాజనీతిజ్ఞుడు మరొకరు ఉండరేమో!?-ఛత్తీస్గఢ్కు చెందిన సీనియర్ మంత్రి ఒకరు ఇటీవల రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు అది నిజమే అనిపిస్తోంది. మరో సారి తాను అధికారం లో కొనసాగాలనేది చంద్రబాబు ప్లాన్. అయితే, దీనికి ఎందుకు? ఏమిటి? అనే విమర్శకుల ప్రశ్నలు సాధారణంగా వినిపించేవే. ఈ క్రమంలోనే చంద్రబాబు పెద్ద ప్లాన్ వేశారు. తాను ఏపీ సీఎంగా ఎందుకు మరోసారి వ్యవహరించాలో సోదాహరణంగా చెప్పకనే చెప్పుకొస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మరో పార్టీ అవసరమా? అని ప్రశ్నించిన ఆయన ఇప్పుడు తన అవసరం ఏంటో చెప్పుకొనే పరిస్థితికి దిగజారినా.. కిందపడ్డా పైచేయి నాదే అనే టైపులో ఆయన వ్యవహరిస్తున్నారు.
విషయంలోకి వెళ్తే.. వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు వివిధ వర్గాల ప్రజలకు వాగ్దానాలు చేస్తున్నారు. 2014లో ఇచ్చిన అనేకానేక హామీలకు సంబంధించి.. ప్రస్తుతం పాలన సాగిస్తున్న ప్రభుత్వం నుంచి ప్రజలు ఆశించే అనేకానేక విషయాలకు సంబంధించి.. ఆయన డెడ్ లైన్లు అన్నిటినీ.. వచ్చే ఏడాదికి పెడుతున్నారు. కనుక తనను, తన పార్టీని గెలిపించకుంటే అది ప్రజల ఖర్మ- అన్నట్లుగా బాబు తీరు సాగుతోంది. మచ్చుకు కొన్ని హామీలను పరిశీలిస్తే.. కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పిస్తానన్న హామీ ఎప్పటిది? 2014లో ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట. దీనికిగాను హడావుడిగా ఆయన ఓ బిల్లు పాస్ చేసినా కేంద్రం ఫైలు తిప్పిపంపిందనే నెపంతో ఆ ఊసెత్తడం మానేశారు.
దీనిని వచ్చే కేంద్ర ప్రభుత్వంలోమరోసారి పెట్టి.. సాధించుకునేందుకు యత్నిస్తామని ఆయన చెబుతున్నారు. అంటే కాపులకు రిజర్వేషన్ కావాలంటే.. వచ్చే ఏడాది కూడా ఆయననే ఎన్నుకోవాలని చెప్పకనే చెప్పారు. ఇక, ప్రభుత్వ ఉద్యోగులకు 11వ పీఆర్సీని వేశారు. వారిని తనవైపు తిప్పుకొనే క్రమంలో చేసిన ఈ ప్రయోగం వచ్చే ఏడాది కానీ ఫలవంతం కాదు. అంటే.. ఇక్కడా చంద్రబాబు వచ్చే ఏడాది దాకా వారికి తానే దిక్కని చెప్పుకొచ్చాడు. నిజానికి ఈ విషయంలో తెలంగాణ ఇచ్చిన మూడు నెలల గడువు కంటే ఎక్కువగా ఇవ్వడం వెనుక ఎన్నికల లాజిక్కే ఉందని అంటున్నారు పరిశీలకులు.
ఇక, పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో తెలీదు.. కేంద్రంతో విభేదాలు వచ్చాక నిధుల లేమిని చూపిస్తూ.. దానిని కూడా మరో ఏడాది ఏడాదిన్నర పొడిగించేందుకు పక్కా ప్లాన్ వేసుకున్నారు చంద్రబాబు. ఇక, అంతర్జాతీయ స్థాయిలో అమరావతి రాజధాని నిర్మాణాన్ని 2018 చివరి నాటికే పట్టాలెక్కిస్తానన్న విషయంలో పెద్ద డ్రామా నడుస్తోంది. కోర్ కేపిటల్ నిర్మాణానికి తప్ప తతిమ్మా రాజధానికి కేంద్రం పైసా ఇవ్వక్కర్లేదని అందరికీ తెలిసిన సంగతే. కోర్ కేపిటల్ విషయంలో వారిచ్చే నిధుల కోసం ఎదురుచూడడం సబబు.
అయితే, మరి మిగిలిన నిర్మాణాలకు సంబంధించి కూడా ఇప్పుడు తాను అనుకుంటున్న ప్రజల నుంచి డబ్బు రుణాలుగా సమీకరించే ప్రయత్నం పాలన లో అయిదో ఏడాదిలో మొదలెట్టడం ఏంటో.. అర్థంకాని సంగతి. అంటే రాజధాని పనులు మొదలు కావాలన్నా వచ్చే ఏడాదే. విజయవాడలో కీలకమైన దుర్గగుడి ఫ్లైఓవర్ ను కూడా వచ్చే ఏడాదికి వాయిదా వేయడం వెనుక కూడా చంద్రబాబు వ్యూహం ఎన్నికలేనని స్పష్టంగా తెలుస్తోంది. ఇలా ఏరకంగా చూసినా.. చంద్రబాబు వచ్చే ఏడాది తనను ఎన్నుకోవాల్సిన ``తప్పని సరి`` పరిస్థితిని కల్పిస్తున్నారనే వాదన బలపడుతోంది. మరి ప్రతిగా ప్రత్యర్థి పార్టీలు ఏం చేస్తాయో చూడాలి.