రాష్ట్ర రాజకీయాలు హుందాతనం కోల్పోయింది. సిద్దాంతాలు, విధానాలు, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కేవలం వ్యక్తిగత దూషణలే లక్ష్యంగా రాజకీయం సాగుతోంది. చంద్రబాబునాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పవన్ కల్యాణ్ ఎవరూ దీనికి అతీతులు కారన్న విషయం తేలిపోయింది. పాదయాత్రలో తాజాగా సామర్లకోటలో పవన్ ను ఉద్దేశించి జగన్ చేసిన కామెంట్లయినా, ఈరోజు ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణను ఉద్దేశించి పవన్ చేసిన ప్రకటన అయినా అదే కోవలోకి వస్తుంది. ఇక, జగన్ ను ఉద్దేశించి చంద్రబాబునాయుడు అండ్ కో ఎప్పటి నుండో వ్యక్తిగత దూషణలు చేస్తూన్న విషయం కొత్తది కాదు.
జనాలే తిరస్కరిస్తారు
పాదయాత్రలో జగన్ జనసేన అధ్యక్షుడు పవన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ కార్లను మార్చినంత ఈజీగా పవన్ పెళ్ళాలను మారుస్తాడు అంటూ చేసిన వ్యాఖ్యలు ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి పెళ్ళాలను మార్చటమన్నది పవన్ వ్యక్తిగత విషయం. జగన్ చెప్పినట్లుగా పవన్ పెళ్ళాలను మార్చటం నిజమే. కానీ ఒకరికి విడాకులు ఇచ్చిన తర్వాతే మరొకరిని వివాహం చేసుకున్న విషయం జగన్ మరచిపోయినట్లున్నారు. వివాహం చేసుకోవటం తర్వాత విడిపోవటమన్నది వారిద్దరికి లేదా కుటుంబాలకు మాత్రమే సంబంధించిన వ్యవహారం. సమాజానికి వచ్చిన నష్టమేమీ లేదే ? నిజంగా పవన్ చేసిన పని జనాలకు నచ్చకపోతే జనాలే తిరస్కరిస్తారు కదా ?
షర్మిల వివాహం మాటేమిటి ?
అదే సమయంలో జగన్ కుటుంబం గురించి కూడా అనేక విషయాలు ప్రచారంలో ఉన్నమాట వాస్తవం కాదా ? జగన్ సోదరి షర్మిలా రెడ్డి వివాహంపై జరుగుతున్న ప్రచారం మాటేంటి ? షర్మిల వివాహం గురించి మాట్లాడితే జగన్ కో లేదా షర్మిలకో ఎలాగుంటుంది ? ఇక, జగన్ పై ఉన్న అవినీతి ఆరోపణల సంగతి కొత్తగా చెప్పేదేముంది ? ఎదుటి వాళ్ళను తప్పపట్టే ముందు మనలో ఏ తప్పు లేకుండా చూసుకోవటం చాలా అవసరం.
జగన్ లక్ష కోట్లు తిన్నారా ?
ఇక, చంద్రబాబు అండ్ కో గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వైఎస్ మరణించిన తర్వాత తలెత్తిన పరిణామాల్లో జగన్ పై అనేక కేసులు నమోదై విచారణ జరుగుతోంది. ఇంత వరకూ ఏ ఒక్క కేసులోనూ విచారణ పూర్తి కాలేదు, శిక్ష పడలేదు. అవినీతికి పాల్పడ్డాడని జగన్ పై ఉన్న కేసుల్లో ఏ ఒక్కదానిలోనూ ఏ మేరకు అవినీతి జరిగిందన్న విషయం తేలలేదు. అయితే, చంద్రబాబు అండ్ కో మాత్రం జగన్ లక్ష కోట్ల రూపాయలు అవినీతి చేశాడంటూ పదేళ్ళుగా ఊదరగొడుతూనే ఉన్నారు. పోయిన ఎన్నికల్లో అధికారానికి జగన్ ఆమడదూరంలో ఆగిపోయిన కారణాల్లో అవినీతి కేసులు కూడా ఒకటి. ఇక, చంద్రబాబు మీదున్న ఆరోపణల సంగతేమిటి ?
బాలకృష్ణకు మతిస్ధిమితం లేదా ?
ఈరోజు పవన్ మాట్లాడుతూ, అప్పుడెప్పుడో జరిగిన టిడిపి ఎంఎల్ఏ, చంద్రబాబు బావమరది నందమూరి బాలకృష్ణ ఇంటిలో జరిగిన కాల్పుల విషయాన్ని ప్రస్తావించారు. చాలా కాలం క్రితం తన ఇంట్లో నిర్మాత బెల్లంకొండ సురేష్, సత్యనారాయణ చౌదరిపై బాలకృష్ణ కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో వారిద్దరూ తీవ్రంగా గాయపడిన విషయం అందరికీ తెలిసిందే. కాల్పుల ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. తనకు మతిస్ధిమితం లేదని బాలకృష్ణ సర్టిఫికేట్ చూపించి కేసులో నుండి బయటపడ్డారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఏదో సర్టిఫికేట్ చూపించి బాలకృష్ణ కేసులో నుండి బయటపడ్డారంటే మన వ్యవస్ధ అంత బలహీనంగా ఉందని తేలిపోయింది. సంబంధం లేకుండా పవన్ ఇపుడు బాలకృష్ణ కేసును ఇపుడు ప్రస్తావిస్తున్నారు. ఇపుడే వ్యక్తిగత దూషణలు ఈ విధంగా ఉంటే రేపు ఎన్నికల సమయానికి ఇంకెంత దుమారం రేపుతాయో చూడాల్సిందే.