చంద్రబాబునాయుడు ఎంతగానో నమ్ముకున్న, ఆశపడుతున్న మహిళలే టిడిపికి షాకిచ్చిరా ?
అవుననే అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు. పోలింగ్ జరిగిన నాలుగు రోజుల నుండి
చంద్రబాబు ఒకటే పాటపాడుతున్నారు. గెలుపు ఓటముల విషయంలో చంద్రబాబుకు స్పష్టమైన ఫీడ్
బ్యాక్ ఉంది. అయినా సరే పసుపు కుంకుమ పథకంలో లబ్దిపొందిన మహిళలందరూ
తెలుగుదేశంపార్టీకే ఓట్లేశారని గట్టిగా చెబుతున్న విషయం అందరూ చూస్తున్నదే.
నిజానికి చంద్రబాబు నమ్మకమేమిటంటే డ్వాక్రా మహిళలు 98 లక్షలమంది ఉన్నారట. ఎన్నికల తాయిలాల్లో భాగంగా చివరి రోజుల్లో చంద్రబాబు హఠాత్తుగా తెరపైకి తెచ్చిన పసుపు కుంకుమ పథకంలో 98 లక్షల మంది మహిళల ఖాతాల్లోకి ప్రభుత్వం డబ్బులు వేసింది. పోలింగ్ కు మూడు రోజులు ఖాతాల్లో డబ్బులు పడ్డాయి కాబట్టి మహిళలంతా తమకే ఓట్లేశారని అనుకుంటున్నారు.
అదే సమయంలో కొన్ని చోట్ల ఈవిఎంలు మొరాయించాయి. దాంతో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓట్లేయకుండానే వెనక్కు వెళ్ళిపోయారు. అయితే చంద్రబాబు పిలపందుకున్న మహిళలంతా మధ్యాహ్నంపైన తిరిగి పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లేశారు కాబట్టి అవన్నీ టిడిపి ఓట్లే అని రెండో వాదన వినిపిస్తున్నారు.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విశ్లేషిస్తే మహిళలంతా టిడిపికి ఓట్లేయలేదని అర్ధమైపోయింది. అదేసమయంలో మమిళల ఓట్లు టిడిపికన్నా వైసిపికే 3.5 శాతం ఎక్కువగా పడ్డాయని తేలిపోయింది. మహాళల ఓట్లు వైసిపికి 48.5 శాతం పడితే టిడపికి 45.06 శాతం పడ్డాయట. ఈ తేడా ఎందుకు వచ్చిందంటే మధ్యలోని 3 శాతం ఓట్లు జనసేనకు పడ్డాయని విశ్లేషణ వినబడుతోంది. అంటే జనసేన లేకపోతే ఆ మహిళల ఓట్లు ఎవరికి పడేవో. అంటే జనసేన వల్ల టిడిపికి బొక్కపడిందని అర్ధమవుతోంది.
అలాగే డ్వాక్రా గ్రూపుల్లో ఉంటూ పసుపు కుంకుమ లబ్ది పొందిన మహిళలంతా టిడిపి వాళ్ళు మాత్రమే కాదని కూడా తేలిపోయింది. డ్వాక్రా గ్రూపుల్లో టిడిపి మద్దతుదారులతో పాటు వైసిపి, జనసేన, వామపక్షాల మద్దతుదారులు కూడా ఉన్నారు. దాంతో ప్రభుత్వం నుండి డబ్బులు అందుకున్నప్పటికీ ఎవరి పార్టీకి వాళ్ళే ఓట్లేసుకున్నారని అర్ధమవుతోంది.
ఇక చంద్రబాబు పిలుపందుకుని ఓట్లేసిన మహిళలంటారా ? అదికూడా ఉత్త డొల్లే అని తేలిపోయింది. మొత్తం 46500 పోలింగ్ కేంద్రాల్లో ఈవిఎంలు మొరాయించినవి, మహిళలు తిరిగి వచ్చి ఓట్లేసింది కేవలం 350 పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే. కాబట్టి చంద్రబాబు నమ్ముకున్న మహిళలే షాకిచ్చినట్లు అర్ధమవుతోంది.