వైసీపీ సీనియర్ నాయకురాలు.. నగరి ఎమ్మెల్యే రోజా విషయం మరోసారి చర్చకు వచ్చింది. రాజకీయంగా ఎప్పుడూ దూకుడుగా ఉండే రోజా.. వైసీపీ తరఫున గట్టి వాయిస్ వినిపిస్తూ.. ప్రతిపక్షాలను టార్గెట్ చేయ డంలో ముందుండేవారు. వరుసగా రెండు సార్లు గెలిచిన రోజా.. గత ఏడాది ఎన్నికల్లో కొంచెం ఎక్కువగానే కష్టపడ్డారు. గాలి ముద్దుకృష్ణమ మరణంతో సానుభూతి పవనాలు వీచి.. ఆయన కుమారుడు గెలుపు గుర్రం ఎక్కే ఛాన్స్ ఉందని తెలియడంతో చాలా దూకుడుగా వ్యవహరించారు. నగరిలోనే సొంతగా ఇల్లు కట్టుకున్నారు. వారానికి నాలుగు రోజులు అక్కడే ఉంటున్నారు.
దీంతో రోజా సెంటిమెంట్ ఫలించి మరోసారి విజయం దక్కించుకున్నారు. గతంలో ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండగా.. అధికార పార్టీపై తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. సీఎంగా ఉన్న చంద్రబాబును భారీగా టార్గెట్ చేశారు. దీంతో ఆమెకు జగన్ కేబినెట్లో మంచి పోస్టు దక్కుతుందనే ప్రచారం జరిగింది. అయితే, జగన్ ఆమెకు ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో కొంత అవమానంగా ఫీలయ్యారు. ఈక్రమంలోనే కీలకమైన ఏపీఐఐసీ చైర్పర్సన్ పదవిని ఆమెకు కట్టబెట్టారు జగన్. ఇదిలావుంటే.. ఇటీవల మరోసారి రోజాకు అవమానం జరిగింది.
తన సొంత నియోజకవర్గంలో మంత్రి నారాయణ స్వామి పర్యటించారు. ఆయనతో పాటు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కూడా ఉన్నారు. అయితే, ఆమె నియోజకవర్గంలోని తన ఇంట్లోనే ఉన్నప్పటికీ.. ఆయన ఆమెకు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో పర్యటించడంపై రోజా ఫైరయ్యారు. ఇది సద్దుమణగలేదు. ఇప్పుడు మరో విషయం చర్చకు వచ్చింది. ఏపీలో సినిమా షూటింగులు, సినిమాహాళ్ల ఓపెన్ వంటి విషయాలపై సినీ పరిశ్రమకు చెందిన చిరంజీవి వంటి పెద్దలు త్వరలోనే జగన్తో భేటీ కావాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో సభ్యులుగా ఉన్న రోజా..ను ఈ భేటీకి పిలుస్తారా. లేదా? అనే చర్చ తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యేగా కూడా ఉన్న రోజా..కు జగన్ దగ్గర మంచి యాక్సెస్ ఉంది. ఈ నేపథ్యంలో ఆమెను ఈ చర్చలకు పిలిచే అవకాశం ఉందని కొందరు అంటుంటే.. పిలిచే అవకాశం లేదని మరికొందరు అంటున్నారు. మొత్తంగా ఈ విషయం సస్పెన్స్గా ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.