ఐసీఎంఆర్ నిర్వహించిన ఈ సర్వే ప్రకారం.. దేశంలో 21శాతం మంది ప్రజలు కరోనా ప్రభావానికి గురయ్యారట. అంటే ఇంకా 80 శాతం మంది కరోనా బారిన పడే అవకాశం మిగిలే ఉందన్నమాట. భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ చేసిన సెరో సర్వేలో ఈ విషయాలు వెలుగు చూశాయి. భారత వైద్య పరిశోధన మండలి గతేడాది డిసెంబర్ 7 నుంచి ఈ ఏడాది జనవరి 8వరకూ జాతీయ స్థాయిలో ఈ సర్వే నిర్వహించింది. ఈ సెరో సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
భారత వైద్య పరిశోధన మండలి దేశవ్యాప్తంగా 28వేల 589 మందిపై అధ్యయనం చేసింది. ఇందులో 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన 21.4శాతం మంది కరోనా ప్రభావానికి గురైనట్లు తేలింది. 10 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్న 25.3శాతం మందిలో వైరస్ ఆనవాళ్లు గుర్తించారు. పట్టణ మురికివాడల్లో 31.7 శాతం మండల స్థాయి మురికివాడల్లో 26.2 శాతం మంది వైరస్ ప్రభావానికి గురయ్యారట. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 19.1 శాతంగా ఉందట. 7వేల 171 మంది ఆరోగ్య సిబ్బంది నుంచి రక్త నమూనాల్లో అందులో 25.7 శాతం మంది వైరస్ బారిన పడినట్లు తేలిందట.
ఇక ఇండియాలో తాజా కరోనా లెక్కలు చూస్తే.. దేశంలో క్రియాశీల కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం లక్షా 55 వేల 25 క్రియాశీల కేసులున్నాయి. రికవరీల్లో కూడా భారత్ ర్యాంకు మెరుగవుతోంది. ప్రస్తుతమున్న క్రియాశీల కేసుల కంటే 67 రెట్లు ఎక్కువ రికవరీలు ఉన్నాయి. రికవరీల్లో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంది. ప్రస్తుతం భారత్లో రికవరీ రేటు 97.13గా ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి