ఇటీవల సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. స్మార్ట్‌ ఫోన్ ఆధారంగా ఎక్కువ మంది మోసాలకు పాల్పడుతున్నారు. మీ బ్యాంక్ అకౌంట్ అప్‌ డేట్ చేస్తున్నాం.. మీ ఆధార్ నెంబర్ అప్‌డేట్ చేస్తున్నాం.. మీకు వచ్చిన ఓటీపీ చెప్పండి అంటూ బ్యాంకు సిబ్బందిలా ఫోన్లు వస్తుంటాయి. పొరపాటున ఓటీపీ చెప్పేశారా.. అంతే సంగతులు. అయితే ఇలాంటి నేరాలపై పోలీసులు అవగాహన పెంచడంతో సైబర్ నేరగాళ్లు కొత్త రూట్లు వెదుక్కుంటున్నారు.

రొటీన్‌ మోసాలు బోర్ కొట్టాయేమో ఓ సైబర్ నేరగాడు ఏకంగా ప్రముఖ నటుడు సోనూసూద్‌ నే వాడేస్తున్నాడు. సోనూసూద్.. ఇప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా గుర్తొస్తున్న పేరు ఇది.  కష్టంలో ఉన్నా అంటూ మెస్సేజ్ పెడితే చాలు.. ఇంటి మనిషిలా ఆ కష్టం తీరుస్తున్నాడు. లాక్‌ డౌన్‌లో వలస జీవులను ఆదుకోవడంతో మొదలైన ఆయన సహాయక చర్యలు.. ఇప్పుడు అనేక మందికి విస్తరించాయి. అందుకే సాయం చేయాలనుకునే వారు కూడా ముందు నెట్‌లో సోనూసూద్ పేరే వెదుకుతున్నారు.

అదిగో అలాంటి వాళ్లను మోసం చేసేందుకు ఓ సైబర్ నేరగాడు తయారయ్యాడు. సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో ఓ నకిటీ అడ్రస్ క్రియేట్ చేశాడు. గూగుల్‌లో కొడితే తన నంబర్ వచ్చేలా చేశాడు. పాపం ఓ దాత.. సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. గూగుల్‌లో సోనూసూద్‌ ఫౌండేషన్ వివరాలు వెతికాడు. అందులో కనిపించిన ఈ సైబర్ నేరగాడి నంబర్‌కు ఫోన్‌ చేశాడు. దీంతో పంకజ్‌సింగ్‌ అనే ఆ సైబర్ నేరగాడు ఆ దాత బ్యాంక్‌ ఖాతా, ఆధార్ వివరాలు తీసుకున్నాడు.

సాయం చేసేందుకు కూడా రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుందంటూ ఓ పది వేలు గుంజాడు. ఆ తర్వాత.. అవతల సాయం పొందే వ్యక్తికి మూడున్నర లక్షలు కావాలంటూ ఆ మొత్తం సాయం చేయాలని ఒత్తిడి చేశాడు. మొత్తానికి విడుదల వారీగా దాత నుంచి రూ.60వేలు వరకూ సదరు సైబర్‌ మోసగాడు పంకజ్‌ సింగ్ వసూలు చేశాడు. ఆ తర్వాత దాతకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఆ తర్వాత పోలీసులు చెక్ చేస్తే  అందంతా ఫేక్ అని తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: