ఇక గతేడాది కంటే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ దారుణంగా మారింది. ఇక ఈ వైరస్ బారిన పడి గతేడాది కంటే ఎక్కవ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఇదిలా ఉంటే మరో వైపు ఈ మహమ్మారి నుండి కోలుకున్న వారికీ అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. తాజాగా ఇటలీ శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం.. కోలుకున్నవారిలో యాంటీబాడీలు కనీసం 8 నెలల పాటు కొనసాగుతాయని వాళ్ళు వెల్లడించారు. ఇక ఇన్ఫెక్షన్ తీవ్రత, బాధితుల వయసు, ఇతర అనారోగ్య సమస్యలు వంటి అంశాలతో సంబంధం లేకుండానే వీటి స్థాయి ఉంటుందని చెప్పారు.
అయితే గత ఏడాది కొవిడ్-19 మొదటి ఉద్ధృతి సందర్భంగా మిలాన్లోని ఒక ఆసుపత్రిలో చేరిన 162 మంది కరోనా బాధితులపై పరిశోధన చేపట్టిన శాస్త్రవేత్తలు.. ఈ నిర్ధారణకు వచ్చారు. అయితే గత ఏడాది మార్చి, ఏప్రిల్లో వీరి నుంచి రక్త నమూనాలు సేకరించారు. నవంబరు చివర్లో మరోసారి వాటిని తీసుకున్నారు. ‘‘కరోనా వైరస్ను నిర్వీర్యం చేసే యాంటీబాడీల ఉనికి వీరిలో క్రమేణా తగ్గుతోంది. అయితే వ్యాధి సోకిన 8 నెలల తర్వాత కూడా వాటి ఉనికి ఉంది. అన్ని నెలల తర్వాత ముగ్గురిలో మాత్రమే ఇవి లేవు’’ అని పరిశోధకులు తెలిపారు. బాధితుల్లో ఇన్ఫెక్షన్ సోకిన 15 రోజుల్లోగా యాంటీబాడీలు ఉత్పత్తి కాకుంటే వారిలో కొవిడ్ తీవ్ర రూపం దాలుస్తుందని వెల్లడించారు.