చంద్రబాబు అధికారం కోల్పోయిన దగ్గర నుంచి జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉన్నారు. గత రెండేళ్లుగా బాబు, జగన్‌ని విమర్శించని రోజు లేదు. అయితే బాబు చేసే విమర్శలని జగన్ పట్టించుకునే పొజిషన్‌లో ఉన్నట్లు కనిపించడం లేదు. జగన్...తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. అయితే జగన్ పట్టించుకోకపోయిన బాబు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎప్పుడు ఏదొక అంశంలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు పెడుతూనే ఉన్నారు.


తాజాగా కూడా ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని చంద్రబాబు, జగన్‌కు లేఖ రాశారు. అలాగే మద్దతుధరకు ధాన్యం కొనుగోలు చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందని, రైతులని జగన్ ప్రభుత్వం నిండా ముంచేస్తుందని బాబు మండిపడ్డారు. ఇక బాబుకు వెంటనే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ కూడా ఇచ్చేశారు. బాబు అబద్దాలు చెబుతున్నారని, బాబు హయాంలోని బకాయిలను జగన్ ప్రభుత్వం చెల్లించిందని, వైసీపీ పాలనలో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని సజ్జల చెప్పుకొచ్చారు.


అయితే ఏ ప్రభుత్వమైన రైతుల సమస్యలని పూర్తిగా పరిష్కరించలేదు. కాకపోతే ఇచ్చిన హామీలని నిలబెట్టుకోకపోతే రైతులు ప్రభుత్వాలనే మార్చేస్తారు. గతంలో చంద్రబాబు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రైతు రుణమాఫీ హామీ. రుణమాఫీ జరుగుతుందని రైతులు వన్‌సైడ్‌గా చంద్రబాబుకు మద్ధతు ఇచ్చారు. ఇక అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రుణమాఫీ విషయంలో కొర్రీలు పెట్టారు.


మొత్తం రుణమాఫీని లక్షన్నరకు పరిమితం చేశారు. అయితే 50 వేలు లోపు రుణం ఉన్నవారికి ఒకసారే మాఫీ చేశారు. కానీ లక్షన్నర లోపు ఉన్నవారికి ఐదు విడతలుగా మాఫీ చేస్తానని చెప్పి, మాట తప్పారు. బాబు అధికారం నుంచి దిగిలోపు పూర్తిగా మాఫీ చేయలేకపోయారు. అందుకే 2019 ఎన్నికల్లో రైతులు జగన్ వైపుకు వచ్చారు. అధికారంలోకి వచ్చిన జగన్ కూడా రుణమాఫీ బాబు హామీ అని చెప్పి, దాన్ని పక్కనబెట్టేశారు. రైతు భరోసా, ఇన్‌పుట్ సబ్సీడీలు అంటూ రైతులకు పలు పథకాలు అందిస్తున్నారు. అయితే జగన్ అందిస్తున్న పథకాలకు కూడా రైతులు సంతృప్తిగా లేరని చెప్పొచ్చు.  ప్రస్తుత ప్రభుత్వం కూడా రైతులకు పూర్తి స్థాయిలో అండగా లేదని, ఏపీలో ఉన్న రైతుల పరిస్థితిని చూస్తే అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: