వైసీపీ సర్కారుపై విమర్శలు చేయడంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న లోకేష్.. నిత్యం ఏదో ఒక అంశంతో సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. దీంతో పార్టీలో యువతకుకొంత ఊపు వచ్చిందనే ఊహాగానాలు వచ్చాయి. పైగా ఆయన ఇటీవల కాలంలో జిల్లాల్లోనూ పర్యటిస్తున్నారు. యువతను సమీకరిస్తున్నారు. యువత సెంట్రిక్గా రాజకీయాలు చేస్తున్నారు. ఎక్కడ అవసరం ఉంటే.. అక్కడకు రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. దీంతో యువత తమకు ఎక్కడ అవసరం ఉన్నా.. లోకేష్ను సంప్రదిస్తున్నారు. కానీ, ఇటీవల 20 రోజులుగా ఆయన పోన్కు కూడా అందడం లేదనే చర్చ సాగుతోంది.
ఈ నేపథ్యంలోనే లోకేష్ అన్న ఏమయ్యారంటూ.. దిగువ శ్రేణి నాయకులు ప్రశ్నించుకుంటున్నారు. కొందరు చనువున్న సీనియర్లకు కూడా ఫోన్లు చేసి ఇదే విషయంపై ప్రశ్నిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం కొందరు లండన్ వెళ్లారని.. మరికొందరు.. స్విట్జర్లాండ్ టూర్కు వెళ్లారని.. అక్కడే ఉన్నారని చెబుతున్నారు. ఇంకొందరు ఢిల్లీలోనే ఉన్నారని.. రాజకీయంగా అక్కడ కొంత నేర్చుకునే పనిచేస్తున్నారని అంటున్నారు.
కానీ, ఈ విషయంలో సీనియర్లు చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి వ్యూహాలు రచిస్తున్నారని చెబుతున్నారు. అయితే.. టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నా.. నందమూరి కుటుంబం ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లింది. వీరితో కలిసి.. లోకేష్ కూడా తన సతీమణితో వెళ్లారని సమాచారం. ఏదేమైనా.. లోకేష్ లేని విషయంపై పార్టీలో ఆసక్తికర చర్చసాగుతుండడం గమనార్హం.