జనసేనాని పవన్ కల్యాణ్‌ కొత్త డిమాండ్‌ తెరపైకి తెచ్చారు. ఇండియాలోని వంద నోటుపై నేతాజీ బొమ్మ ముద్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితానికి సంబంధించిన ఓ పుస్తక సమీక్ష కార్యక్రమానికి హాజరైన పవన్ కల్యాణ్.. నేతాజి అస్తికలు ఇంకా జపాన్‌లోని రెంకోజి ఆలయంలోనే ఉన్నాయని.. నేతాజి అస్తికలను భారతదేశంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆ అస్తికలు నేతాజీవి అవునా కాదా అనేవి పరీక్షలు చేయలేరా.. ఇప్పటికి మూడుసార్లు ప్రయత్నించినా కుదరలేదు... నేతాజి అస్తికలు దేశానికి రావాలని ప్రజలు కోరుకోవాలని పవన్ కల్యాణ అన్నారు.


దీని కోసం #RenkojitoRedfort పేరుతో హ్యాష్ ట్యాగ్ ను పవన్ కల్యాణ్‌ ప్రతిపాదించారు. నేతాజీ లాంటి మహాత్మున్ని గౌరవించుకోకపోతే మనం భారతీయులమే కాదన్న పవన్ కల్యాణ్.. నేతాజి అస్తికలు రెంకోజీ ఆలయంలో దిక్కులేకుండా ఉన్నాయన్నారు. #BringbackNetajiAshes హ్యాష్ ట్యాగ్ ను కూడా వాడాలని సూచించిన పవన్.. నేతాజి కోసం కొత్త తరం కదలాలని..   ఈ దేశం నాదనుకునే ఒక్క నాయకుడు కూడా లేడని అన్నారు. ఎంతో మంది చేసిన బలిదానాల వల్లే ఈరోజు దేశంలో విలాసాలు చేసుకుంటున్నారని గుర్తు చేసిన పవన్ కల్యాణ్.. వంద రూపాయల నోటుపై నేతాజి బొమ్మ వేయాలని డిమాండ్ చేశారు. జైహింద్ అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ ను ఘనంగా స్మరించుకోవాలని పిలుపు ఇచ్చారు.


ఈ పుస్తకం రాసిన ఎంవీఆర్ శాస్త్రితో తనకు మూడు సార్లు మాత్రమే పరిచయం ఉందని.. కామన్ మ్యాన్ ప్రొటక్షన్ ఫోర్స్ సమయంలో ఎంవీఆర్ శాస్త్రితో పరిచయం ఏర్పడిందని పవన్ గుర్తు చేసుకున్నారు. మన నుడి-మన నది కార్యక్రమంలో మరోసారి కలిశానని.. ఇప్పుడు ఈ పుస్తక సమీక్షలో కలిశానని... తనకు మేథావులంటే భయం, నేను సగటు మనిషిని అంటూ పవన్ చెప్పుకున్నారు. ఎంవీఆర్ శాస్త్రి దాదాపు 20 పుస్తకాలు రచించారని.. ఎవరికైనా సినిమా ఫ్రీగా చేస్తానేమో కానీ పుస్తకాలను మాత్రం ఇవ్వనని పవన్ కల్యాణ్ చెప్పారు. త్రివిక్రమ్ వస్తున్నాడంటేనే పుస్తకాలను దాచేస్తానని.. అనంతపద్మనాభ స్వామి నేలమాలిగల్లో ఉన్న సంపద కంటే గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలకే ఎక్కువ విలువ ఉందని పవన్ చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: