ఆంధ్రప్రదేశ్: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు.ఈ నెల 30 వ తేదీన పిఠాపురం నుంచి సమర శంఖం పూరిస్తున్నారు. పిఠాపురం కేంద్రంగానే పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నారు. మూడు విడతలుగా పవన్‌ కళ్యాణ్ ప్రచారం ఉండేలా పర్యటన షెడ్యూల్‌ రూపొందిస్తున్నారు పార్టీ నేతలు. ప్రతి విడతలో జనసేన పార్టీ పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్‌ రూపొందించనున్నారు. ప్రచారంలో భాగంగా పవన్ కల్యాణ్ ఈనెల 30 వ తేదీన పిఠాపురం వెళ్తారు. మొదటి రోజు శక్తిపీఠమైన శ్రీ పురూహూతిక అమ్మవారిని పవన్‌ దర్శనం చేసుకోనున్నారు. అక్కడ వారాహి వాహనానికి పూజలు చేసిన తరువాత దత్తపీఠాన్ని సందర్శిస్తారు. ఇక ఆ రోజు నుంచి మూడు రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉంటారు. ఈ క్రమంలో పార్టీ నేతలతో అంతర్గత సమావేశాలని నిర్వహిస్తారు.


 క్రియాశీల కార్యకర్తలతో మండలాల వారీగా సమావేశాలు ఉంటాయని పవన్‌ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ ప్రకటనలో తెలిపారు.అలాగే టీడీపీ, బీజేపీ నేతలతో కూడా పవన్ కళ్యాణ్ భేటీలకు ఏర్పాట్లు చేస్తున్నారని.. పిఠాపురం నుంచే రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు వెళ్లాలని పవన్‌ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పిఠాపురం నియోజకవర్గంలో బంగారు పాప దర్గా సందర్శన, క్రైస్తవ పెద్దలతో సమావేశంతో పాటు సర్వమత ప్రార్థనల్లో పవన్‌ కళ్యాణ్ పాల్గొంటారు. ఉగాది వేడుకలను కూడా పవన్‌ కళ్యాణ్ పిఠాపురంలోనే నిర్వహించుకోనున్నారు.ఇప్పటికే 18 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానంలో అభ్యర్థులను ప్రకటించిన పవన్ కల్యాణ్.. పెండింగ్ స్థానాలపై కసరత్తు చేస్తున్నారు.3 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానంలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ అసెంబ్లీ స్థానాలు ఇంకా మచిలీపట్నం పార్లమెంట్ పై కొనసాగుతున్న సందిగ్ధత కొనసాగుతోంది. ఆ ప్రాంతాల నేతలతో ఇప్పటికే భేటీ అయిన పవన్  పలుమార్లు చర్చలు నిర్వహించారు. ఇవాళ రేపట్లొ ఫైనల్ చేసి ఎన్నికల ప్రచారానికి పవన్ బయలుదేరనున్నారని సమాచారం తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: