- పార్టీ కోసం ఎమ్మెల్యే సీటే వదులుకున్న జవహర్
- బాబు ప్రయార్టీలో ఫస్ట్ లిస్టులోనే వీరికి పదువులు
( గోదావరి - ఇండియా హెరాల్డ్ )
వారిద్దరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలు.. తెలుగుదేశం పార్టీ తరపున పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. పార్టీ ఓడిపోయినప్పుడు.. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా బలమైన వాయిస్ వినిపించారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన వేళ వారు చేసిన త్యాగాలు, పోరాటాల నేపథ్యంలో వారిద్దరికి పదవులు ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు మీదే ఉంది.. వారిద్దరు ఎవరో కాదు.. ఒకరు పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య అయితే.. మరో నేత మాజీ మంత్రి కేఎస్. జవహర్.
వర్ల రామయ్య పోలీస్ శాఖలో పదవి వదులుకుని మరీ పార్టీలోకి వచ్చారు. 2009లో తిరుపతి ఎంపీగా, 2014లో పామర్రు నుంచి అసెంబ్లీకి పోటీ చేసి రెండుసార్లు స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2019లో తనయుడు కుమార్ రాజా కోసం తన సీటు త్యాగం చేశారు. అంతకుముందు ఆయనకు రాజ్యసభ సీటు చివరి వరకు అంది వచ్చి మరీ చేజారింది. ఇక ఈ ఎన్నికల్లో వర్ల తనయుడు కుమార్ రాజా పామర్రు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే పార్టీ కోసం గతంలో రెండుసార్లు పోటీ చేయడంతో పాటు సీనియర్ నేత కావడంతో ఈ సారి ఆయనకు ఖచ్చితంగా కీలకమైన పదవి ఇస్తారని అంటున్నారు. ఏదో ఒక కార్పోరేషన్ పదవి లేదా... కుదిరితే ఎమ్మెల్సీ రేసులో కూడా వర్ల ఉన్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
కేఎస్. జవహర్ :
ఇక మాజీ మంత్రి జవహర్ ఉపాధ్యాయ వృత్తి వదులుకుని పార్టీలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా.. మంత్రిగా ఉండి కూడా పార్టీ శ్రేయస్సు కోసం కృష్ణా జిల్లా తిరువూరుకు మారి పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో సీటు ఇవ్వకపోయినా పార్టీ గెలుపుకోసం తన వంతుగా కష్టపడ్డారు. పార్టీలో తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండి తన జిల్లాలో పార్టీని స్వీప్ చేయించారు. ఈ సారి ఆయనకు ఎమ్మెల్సీ వస్తుందన్న ప్రచారం ఉన్నా కీలకమైన ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇస్తారనే అంచనాలే ఎక్కువుగా ఉన్నాయి. ఏదేమైనా జవహర్కు కీలక పదవి ఇవ్వడం న్యాయం.. సముచితం కూడా..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి