
విషయం ఏంటంటే, 2018 నాటి అంచనాలతో పోలిస్తే.. ఇప్పుడు ప్రతిపాదించిన రేట్లు దాదాపు రెట్టింపు అయ్యాయి. అప్పట్లో చదరపు అడుగుకు సుమారు 4,350 రూపాయల లెక్కన మొత్తం ప్రాజెక్టు వ్యయం 2,271 కోట్లుగా ఉంటే.. ఇప్పుడు అదే నిర్మాణానికి చదరపు అడుగుకు ఏకంగా 8,981 రూపాయల చొప్పున మొత్తం ఖర్చు 4,688 కోట్లకు చేరింది. అంటే, కేవలం నాలుగేళ్లలోనే అంచనా వ్యయం 2,417 కోట్లు పెరిగిపోయింది.
నిజానికి, ఈ నాలుగేళ్లలో స్టీలు, సిమెంట్ వంటి కీలక నిర్మాణ సామాగ్రి ధరల్లో భూమి బద్దలయ్యేంత మార్పులేమీ రాలేదు. పైగా, అప్పుడు ప్రతిపాదించిన 'డయాగ్రిడ్' టెక్నాలజీనే ఇప్పుడూ వాడుతున్నామని అంటున్నారు. అయినా సరే, చదరపు అడుగుకు ఏకంగా 4,631 రూపాయలు అదనంగా ఎలా పెరిగిందనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇంజినీరింగ్ నిపుణులు సైతం ఈ 'అంకెల గారడీ' చూసి నోరెళ్లబెడుతున్నారట.
ఈ భారీ అంచనాల వెనుక పెద్ద కథే నడుస్తోందని ఇన్సైడ్ టాక్. ఓ కీలక నేత అండదండలతో ముగ్గురు బడా కాంట్రాక్టర్లకు ఈ పనులను ప్యాకేజీల వారీగా కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైందట. పని మొదలవ్వగానే మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద 10% ముట్టజెప్పి, ఆ తర్వాత బిల్లుల చెల్లింపుల టైంలో ఈ పెంచిన అంచనాల ద్వారా భారీగా 'వసూళ్ల' పర్వానికి స్కెచ్ గీశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది అచ్చం 2015లో తాత్కాలిక సచివాలయం నిర్మాణంలో జరిగిన తంతునే గుర్తు చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
నిన్న మొన్నటి వరకు, కేవలం 450 కోట్లతో రుషికొండపై కట్టిన భవనాలపై 'వేల కోట్ల దోపిడీ', 'ప్రజాధనం దుర్వినియోగం', 'రాజమహల్' అంటూ గొంతు చించుకున్న నేతలే ఇప్పుడు అమరావతి విషయంలో ఇలా వేల కోట్లలో అంచనాలు పెంచేయడం చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. ఆనాడు ఆ ఆరోపణలను నమ్మి ఓట్లేసిన ప్రజలు, అంతకు ముందు ప్రభుత్వం చేసిన పనుల విషయంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చినా, వాళ్లకే పట్టం కట్టారు.
దీన్నిబట్టి, ఎవరున్నా ఇంతే 'ఎవరు తినలేదు గనుక' అనే ధోరణికి ప్రజలు అలవాటు పడిపోయారా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఏది ఏమైనా, అమరావతి నిర్మాణాల అంచనాల వ్యయం ఇలా ఆరంభంలోనే ఆకాశాన్ని తాకుతుంటే.. పూర్తయ్యేసరికి ఇంకెన్ని వేల కోట్లకు పెరుగుతుందోనన్న ఆందోళన మాత్రం సర్వత్రా వ్యక్తమవుతోంది.