తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుపై ఫైరయ్యారు. కాళేశ్వరం అవినీతి కేసులో సీబీఐ విచారణకు తాము సిఫారసు చేసినా ఎందుకు స్పందన రాలేదని కేంద్రాన్ని నిలదీశారు. ఫార్ములా ఈ రేసు స్కామ్‌లో కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి కావాలని గవర్నర్‌కు లేఖ పంపినా చర్యలేమీ తీసుకోలేదని విమర్శించారు. ఈ నిర్లక్ష్యం వెనుక బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ఉన్న గుట్టు ఒప్పందమే కారణమని రేవంత్ వ్యాఖ్యానించారు. త్వరలో ఆ రెండు పార్టీలు విలీనం అయ్యే అవకాశముందని కూడా చెబుతున్నారు. కానీ రేవంత్ వాదనలకీ రాజకీయ వాస్తవాలకీ పెద్ద తేడా ఉంది. కేటీఆర్‌ను అరెస్టు చేయడానికి గవర్నర్ అనుమతి అవసరం లేదు. చట్టపరంగా స్పీకర్‌కు సమాచారం ఇవ్వడం చాలు. అంతే తప్ప.. గవర్నర్ అడ్డుపడలేరు.
 

సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్‌కు ఎటువంటి ఊరట లభించలేదు. అయినా కూడా రేవంత్ సర్కార్ మాత్రం ఆ దిశగా కదల్లేదు. కేటీఆర్ తాను సవాలు చేసినా, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రాజకీయంగా లాభనష్టాలను లెక్కించి వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఆ వైఫల్యాన్ని బీజేపీ-బీఆర్ఎస్ కుమ్మక్కుగా చూపడం తప్ప మరేదీ కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి రిపోర్ట్‌ను సీబీఐకి అప్పగించడం అంటే.. దానిని బీజేపీ చేతుల్లోకి ఇవ్వడమే. ఎన్నికల సమయంలో “కాళేశ్వరం దోపిడీ చేసిన వారిని జైలుకి పంపిస్తాం” అని రేవంత్ ఘోషించారు. కానీ ఇప్పుడు అదే రిపోర్ట్‌ను కేంద్ర ఏజెన్సీకి అప్పగించి చేతులు కట్టేసుకున్నారు. సీబీఐ విచారణ జరగకపోతే, దాని కోసం కేంద్రాన్ని నిందించడం సరైన రాజకీయ తర్కం కాదు.

 

ఇక అసలైన సమస్య రేవంత్ రెడ్డి గవర్నెన్స్ పై పెరుగుతున్న విమర్శలు. ఇన్‌ఫ్లేషన్, ఉద్యోగ నియామకాల్లో ఆలస్యం, విద్యుత్ సంక్షోభం వంటి అంశాలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. దానినుంచి దృష్టి మళ్లించేందుకే బీజేపీ-బీఆర్ఎస్ కుమ్మక్కు కథనాన్ని తెరపైకి తెచ్చారని ప్రత్యర్థులు అంటున్నారు. ప్రజలు మాత్రం ఒకే ప్రశ్న అడుగుతున్నారు – ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఎంత నెరవేరింది? బీజేపీ-బీఆర్ఎస్ కుమ్మక్కు అనే మాటతో రేవంత్ కొంత పబ్లిక్ అటెన్షన్ పొందవచ్చు. కానీ వాస్తవిక చర్యలు తీసుకోకపోతే అది బూమరాంగ్ అవుతుంది. కాళేశ్వరం అవినీతిపై నిజమైన సాక్ష్యాలతోనే ప్రజల నమ్మకం గెలుచుకోవాలి – రాజకీయ ఆరోపణలతో కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: