మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి, బీజేపీ సీనియ‌ర్ నేత వెంకయ్య నాయుడు మరోసారి రాజకీయ వాతావరణాన్ని కుదిపేశారు. సాధారణంగా సున్నితమైన వ్యాఖ్యలు చేసే వెంకయ్య, ఈసారి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై పరోక్షంగా గుప్పెడు విమర్శలు విసిరారు. ఆయ‌న నేరుగా రాష్ట్రాల పేర్లు ప్రస్తావించకపోయినా, ఆయన మాటల దారితీసే దిశ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది! ఇటీవల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించే పథకాలపై వెంకయ్య నాయుడు ప్రశ్నల వర్షం కురిపించారు. “మహిళలకు ఉచిత బస్సు ప్రయోజనం ఏమిటి? సాధారణ ప్రజలు బస్సులు ఎక్కడం మానేశారు. పన్నులు చెల్లించే ప్రతి వ్యక్తి సొమ్ముతో కొందరికే రాజకీయ ప్రయోజనం కల్పించడం సరికాదు,” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చిన వెంటనే తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ మొదలైంది.
 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటిలోనూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలులో ఉంది. కాబట్టి వెంకయ్య వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించాయో అనేది చెప్పకపోయినా, అందరికీ అర్థమయ్యేలా ఉంది. ఆయన అభిప్రాయం స్పష్టం - “ఉచితాలకంటే విద్య, వైద్యం, ఉపాధిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి.” అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే - బీహార్ ఎన్నికల్లో బీజేపీ మహిళలకు రూ.10,000 నగదు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో వెంకయ్య ఈ విషయంలో మౌనం వహించడంపై విమర్శలు రావడం గమనార్హం. అయినా కూడా, తన సూత్రాలపై ఆయన కట్టుబడి ఉన్నట్టుగా ఈ వ్యాఖ్యల ద్వారా మళ్లీ చూపించారు. వెంకయ్య నాయుడు మరో కీలక అంశాన్ని కూడా ప్రస్తావించారు - రాష్ట్రాలు చేస్తున్న అప్పులపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు.

 

“ప్రజల భవిష్యత్తు మీద భారంగా మారుతున్నాయి ఈ అప్పులు! ఐదేళ్లలో ఎంత అప్పు చేశారు, ఎంత చెల్లించారు అనేది ప్రజలముందు శ్వేతపత్రంగా ఉంచాలి,” అంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలతో రెండు రాష్ట్రాల ఆర్థిక విధానాలు మళ్లీ చర్చలోకి వచ్చాయి. ముఖ్యంగా భారీ అప్పులతో పరిపాలన కొనసాగిస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలపై ఈ వ్యాఖ్యలు పెద్ద పంచ్‌గా మారాయి. వెంకయ్య నాయుడు మాటల్లో పాత ఉత్సాహం, పాత శైలీ మళ్లీ కనిపించింది. ఉచితాల రాజకీయం ఎంతవరకు సరైనదన్న ప్రశ్నను మళ్లీ తెరపైకి తెచ్చిన వెంకయ్య వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల పాలకులకు తలనొప్పిగా మారాయి. “ఉచితాల కంటే అభివృద్ధి ముఖ్యం” — ఇదే వెంకయ్య నాయుడు తాజా మెసేజ్!

మరింత సమాచారం తెలుసుకోండి: