ముఖ్యంగా విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు అప్పట్లో పెద్ద సవాలుగా ఉన్నా వాటిని విజయవంతంగా అమలు చేసి దేశానికి మార్గదర్శకంగా నిలిచారని అన్నారు. “ ఒకప్పుడు సంస్కరణలు అంటే ప్రజలు భయపడే కాలం. అలాంటి సమయంలో వాటిని అమలు చేసి ధైర్యంగా ముందుకు సాగిన నాయకుడు చంద్రబాబు. ఆయన్ను నేను చాలా దగ్గరగా చూశాను… ఆయన నిజమైన పాలనాదక్షుడు ” అని ఉపరాష్ట్రపతి అభినందనలు తెలియజేశారు. అనంతరం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్లో కూడా చంద్రబాబు లాంటి నాయకత్వం తప్పనిసరి అని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన దూరదృష్టి, పెట్టుబడులను ఆకర్షించే నైపుణ్యం, సమయానుకూల నిర్ణయాలు ఇవన్నీ చంద్రబాబులో ఉన్నాయని ఆయన కితాబు ఇచ్చారు.
“ఎక్కడ అభివృద్ధి అవకాశాలు ఉంటాయో అక్కడ చంద్రబాబు ఉంటారు. ఏదైనా మంచి చేయాలన్నదే ఆయన తలంపు. అందుకే నేటికీ ఆయన విజన్ అనేక రాష్ట్రాలకు మార్గదర్శకంగా కొనసాగుతోంది ” అని రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. పెట్టుబడులను దూసుకురావడంలో చంద్రబాబు ‘ఘనాపాఠి’ అని చెప్పడం విశేషం. ఇదే సందర్భంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కూడా రాధాకృష్ణన్ ప్రశంసించారు. గత 11 సంవత్సరాలుగా మోదీ సర్కారు పేదల జీవన ప్రమాణాలను పెంచే దిశగా సమగ్ర కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. కోట్లాది కుటుంబాలకు సొంతింటిని నిర్మించి ఇచ్చిన ‘ఆవాస్’ పథకం దేశ చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమమని అన్నారు.
అలాగే యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఎంఎస్ఎంఈ రంగం ద్వారా కేంద్రం చేస్తున్న కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉపరాష్ట్రపతి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒకవైపు చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశంసించడం, మరోవైపు మోదీ సర్కారు పనితీరును పొగడటం జాతీయ, రాష్ట్ర రాజకీయాలలో కొత్త చర్చలకు దారితీస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి