
ఫేస్బుక్.. తొలితరం సోషల్ మీడియా.. అప్పటి వరకూ ఏదైనా పత్రికల్లోనో.. టీవీల్లోనూ, రేడియోలోనే మన వాయిస్ వినిపించే అవకాశం ఉండేది.. మన వాయిస్ మనమే వినిపించే అవకాశం ఇచ్చిన తొలితరం సోషల్ మీడియాల్లో ఫేస్బుక్ ఒకటి... అప్పుడే దీనికి 18 ఏళ్లు నిండిపోయాయి. మొదట్లో ఫేస్ బుక్ కంటే ముందు ఆర్కుట్ అని ఓ సోషల్ మీడియా ఉండేది. ఫేస్బుక్ విజృంభణతో అది కాస్తా మూతబడింది.
ఇక ఫేస్బుక్ తర్వాత..టిక్ టాక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టెలిగ్రామ్.. ఇలా అనేక సోషల్ మీడియా మాధ్యమాలు వచ్చాయి. అయితే వీటి రాకతో ఇప్పుడు ఎన్నివచ్చినా ఫేస్బుక్ మ్యాజిక్ మాత్రం అలాగే ఉండేది.. కానీ ఇప్పడు ఆ క్రేజ్ తగ్గుతోందట. 18 ఏళ్ల చరిత్రలో ఫేస్బుక్ యూజర్ల సంఖ్య ఈ ఏడాది ఫస్ట్ టైమ్ తగ్గింది. గత డిసెంబర్తో ముగిసిన త్రైమాసికానికి ఫేస్బుక్ యూజర్ల సంఖ్య 192 కోట్ల 90 లక్షలకు పడిపోయిందట. దీనికి ముందటి త్రైమాసికంలో ఫేస్బుక్ యూజర్ల సంఖ్య 193 కోట్లుగా ఉండేది. అంటే మూడు నెలల్లోనే ఫేస్బుక్ యూజర్ల సంఖ్య 10 లక్షలు తగ్గిపోయిందన్నమాట.
ఈ లెక్కలు వెల్లడి కావడంతో ఈ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఎంతగా అంటే.. ఫేస్బుక్ మాతృసంస్థ మెటా షేర్లు ట్రేడింగ్ ఆఫ్టర్ అవర్స్లో 20శాతం మేరకు తగ్గిపోయాయి. దీంతో ఫేస్బుక్ మార్కెట్ విలువలో ఏకంగా 200 బిలియన్ డాలర్లు తగ్గిపోయింది. అదే సమయంలో పిన్ట్రస్ట్, స్నాప్ షేర్లు కూడా పతనం అయ్యాయి. దీనిపై ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ స్పందించారు. యూత్ ఫేస్బుక్ను వీడి ప్రత్యర్థి ప్లాట్ఫామ్లకు వెళ్లిపోతుండటం వల్ల ఫేస్బుక్ వ్యాపారం తగ్గుతోంది. ప్రపంచంలోనే గూగుల్ తర్వాత అతిపెద్ద డిజిటల్ వాణిజ్య ప్రకటనల ప్లాట్ఫామ్ ఈ మెటా. ఇప్పుడు ఈ లెక్కలతో ఫేస్బుక్ మాతృసంస్థ మెటా షేర్లు 20 శాతం మేర తగ్గాయి.