తెలుగు స‌మాజాన్ని ఆలోచింప‌జేసే ర‌చ‌న‌లు చేశారు పానుగంటి లక్ష్మీ నరసింహారావు. 1865, నవంబర్ 2న రాజమండ్రి తాలూకా సీతానగరంలో జన్మించాడు. వీరి తల్లిదండ్రులు రత్నమాంబ, వేంకటరమణయ్య. తండ్రి రాజమండ్రిలో పేరుపొందిన ఆయుర్వేద వైద్యులు. వీరు 1884లో మెట్రిక్యులేషన్, 1886లో ఇంటర్, 1888లో బి.ఎ. పరీక్షలలో ఉత్తీర్ణులైనారు. తరువాత పెద్దాపురం హైస్కూలులో మొదటి అసిస్టెంటుగా ఉద్యోగం చేశారు.సారంగధర చరిత్ర, వృద్ధ వివాహము, రాధాకృష్ణ, నర్మదా పురుకుత్సీయము, సరస్వతి, దుష్టప్రధాని, ఆనందనాథ, కల్యాణరాఘవము, కంఠాభరణము, విజయరాఘవము, కోకిల, విప్రనారాయణ చరిత్ర, విచిత్ర సమావేశము, విచిత్ర మరణము, బుద్ధబోధసుధ, వీరమతి, పూర్ణిమ, ప్రచండ చాణక్యము (ఇత్యాది నాటకములు). హాస్యవల్లరి, పతనము, మంజువాణి, జగన్నాథమూర్తి, మోసము, జలజ, సాక్షి వంటి ర‌చ‌న‌లు ఆయ‌న‌కు ఎంత‌గానో పేరు తీసుకువ‌చ్చాయి.


వాస్త‌వానికి సాక్షి వ్యాసాలు పానుగంటి లక్ష్మీ నరసింహారావు రచించిన ప్రసిద్ధ తెలుగు వ్యాసములన్ని కూడ చిక్కనైన గ్రాంధిక భాషలో రాశారు. తెలుగు మాతృభాష గల వారు కూడ అర్ధం చేసుకోవటానికి కొంత శ్రమ పడితేకాని అర్థం కావు. వ్యాసాలన్నీ కూడ కొంత వినోదపూర్వక భావంతోనే రాయబడినప్పటికి, అప్పటి సామాజిక పరిస్థితులను ఎండగడుతూ ఉంటాయి. ప్రతి వ్యాసము ఏదో ఒక సామాజిక విషయాన్ని స్పృశిస్తూనే ఉంటుంది. వ్యాసాలన్నీ కూడ, 1913 - 1933 మధ్య కాలంలో వెలువడినాయి. 1711 - 12 లో స్పెక్టేటర్ అనే ఆంగ్ల పత్రికలో జోసెఫ్ అడ్డిసన్, రిచర్డ్ స్టీల్ వ్రాసినస్పెక్టేటర్ పేపర్స్ వ్యాసాలతో ప్రేరణ పొందిన పానుగంటి స్పెక్టేటర్ క్లబ్ తరహాలో సాక్షి సంఘం అని పేరుపెట్టాడు.


సామాజిక రుగ్మతలను ఎండగడుతూ ఆయన రాసిన సాక్షి వ్యాసాలు తెలుగు సాహితీ వినీలాకాశంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఆయన రాసిన నాటకాలు కూడా ఆనాటి సాహితీ అభిమానుల ఆదరణను పొందాయి. " పానుగంటి సాక్షి వ్యాసాలు చదవడం మాననంటి.. ఎంచేతనంటే వాటిలో పేనులాంటి భావానికాయన ఏనుగంటి రూపాన్నియ్యడం నేనుగంటి" అని శ్రీశ్రీ సైతం కొనియాడిన మేటి సాహితీ శిఖరం పానుగంటి. రచనల వలన విశేషంగా డబ్బు సంపాదించినా  నిల్వ చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. దీంతో చివ‌రి రోజుల్లో ఆయ‌న పేదరికానికి ఋణబాధకు లోనయ్యారు. అక్టోబరు 7న, 1940లో మరణించారు.










మరింత సమాచారం తెలుసుకోండి: