స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా వాట్సప్  ను  వాడుతూ ఉంటారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా రోజూ వాట్సప్ చూడకపోతే నిద్ర పట్టని వాళ్లు ఉంటారు.అంతలా ఈ వాట్సప్ కు జనాలు అలవాటు పడిపోయారు. ఇప్పుడు చిన్న పిల్లలు సైతం ప్రెండ్స్ తో వాట్సప్ చాటింగ్ కు అలవాటు పడుతున్నారు. కొద్దిసేపు ఖాళీగా ఉంటే చాలు చాలా మంది ఫ్రెండ్స్ తో వాట్సప్ చాటింగ్ చేస్తూ టైమ్ పాస్ చేస్తారు. అయితే ప్రస్తుతం నకిలీ వాట్సప్ కూడా ఒకటి వచ్చిందని హెచ్చరికలు జారీ చేసింది ఈఎస్ఈటీ. జీబీ వాట్సప్‌ అనే వాట్సప్‌ క్లోన్‌ యాప్‌ భారత దేశంలోని వాడకందార్లపై గూఢచర్యం చేస్తున్నట్టు ఈఎస్‌ఈటీ నివేదిక హెచ్చరిస్తోంది. ఈ థర్డ్‌ పార్టీ యాప్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌లో లేకపోయినప్పటికీ వివిధ వెబ్‌సైట్లలో డౌన్‌లోడ్‌ చేసుకోవటానికి అందుబాటులో ఉందని తెలిపింది. వాట్సప్‌ మాదిరిగానే జీబీ వాట్సప్‌లోనూ అన్ని ఫీచర్లు ఉంటాయని తెలిపింది. ఇంకొన్ని అదనపు సౌకర్యాలు కూడా ఉన్నాయని, ఇది మాల్వేర్‌ ఫైళ్లతో ఫోన్‌ మీద నిఘా పెడుతుందని హెచ్చరించింది. నిఘా పెట్టినట్లు మనకు తెలియను కూడా తెలియదని ఈఎస్ఈటీ తెలిపింది.


జీబీ వాట్సప్ పక్కా ఫేక్. ఇది నెమ్మదిగా ఫోన్‌ రోజువారీ వ్యవహారాలను గమనిస్తూ వస్తుందని, ఇలాంటి అన్‌సపోర్టెడ్‌ యాప్‌లను వాడేవారి ఖాతాలపై వాట్సప్‌ తాత్కాలికంగా నిషేధం కూడా విధించింది. దీన్ని తొలగించాక అలాగే వాడితే శాశ్వతంగా వాట్సప్‌ వాడుకోకుండానూ నిషేధించనుంది. క్లోన్‌ వాట్సప్‌ కేసులు ఎక్కువగా భారత్ తో పాటు ఈజిప్టు, బ్రెజిల్‌, పెరూలో వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి నకిలీ వాట్సప్‌ యాప్‌ల బారినపడకుండా ఉండేందుకు స్మార్ట్ ఫోన్ వినియోగదారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వాట్సప్‌ యాప్‌ను, అప్‌డేట్లను విధిగా గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచే డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, తెలియని థర్డ్‌ పార్టీ యాప్‌ల జోలికి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.వాట్సప్‌ అప్లికేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని ఓసారి చెక్ చేసుకోవాలని, ఫేక్ అనిపిస్తే వెంటనే అన్‌ ఇన్‌స్టాల్‌ చేయాలని తెలియజేస్తున్నారు. ఫోన్‌లో సెక్యూరిటీ స్టేటస్‌ను చెక్‌ చేసుకోవాలని, అనధీకృత యాంటీవైరస్‌ ఏదైనా ఇన్‌స్టాల్‌ అయ్యిందేమో చూసుకోవాలని చెబుతోంది. ఫేక్ యాప్ లపై మొబైల్ ఫోన్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: