కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో అనేక దేశాల్లో భారతీయులు చిక్కుకున్నారు. సుమారు 53దేశాలలో ఇప్పటివరకు మొత్తం 3,336మంది భారతీయులు కరోనా వైరస్ బారినపడినట్లు ప్రభుత్వవర్గాలు తెలిపారు. ఇందులో ఏకంగా 25మంది మరణించినట్లు వెల్లడించాయి. కరోనా వైరస్ బారినపడిన వారిలో ఎక్కువగా కువైట్, సింగపూర్, ఖతార్ తదితర దేశాల్లో ఉన్నారు. కువైట్లో 785మంది, 634మంది సింగపూర్లో, ఖతార్లో 420మంది, ఇరాన్లో 308మంది,యూఏఈలో 238మంది, సౌదీ అరేబియాలో 186మంది, బహ్రెయిన్లో 135మంది, ఒమన్లో 297మంది కరోనా వైరస్ బారినపడినట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి.
అలాగే. ఇటలీలో 91మంది, మలేషియాలో 37మంది, పోర్చుగల్లో 36మంది, ఘనాలో 29మంది, యూఎస్లో 24మంది, స్విట్జర్లాండ్లో 15మంది, ఫ్రాన్స్లో 13మంది కరోనా వైరస్ బారినపడినట్లు వెల్లడించాయి. అయితే విదేశాల్లో కరోనాతో మరణించిన 25 మందిలో అమెరికాలోనే 11మంది ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే.. ఆయా దేశాల్లో వారికి వైద్యసేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాధితుల కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి.