మతసామరస్యానికి ప్రతీక, ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ఈనెల 25 నుంచి ప్రారంభం అవుతోంది. కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రంజాన్ మాసం కోసం స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. రంజాన్ మాసంలో మసీదుల్లో సామూహిక ప్రార్థనలు చేయొద్దని, ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఈ మేరకు ఇదే విషయాన్ని తెలంగాణ వక్ఫబోర్డు చైర్మన్ మహ్మద్ సలీం చెబుతున్నారు. ఇంట్లో ప్రార్థనలు చేయాలని, పేదలకు సాయం చేయాలని సూచించారు.
అంతేగాకుండా.. ఇఫ్తార్ విందును కుటుంబ సభ్యులతో కలిసి చేసుకోవాలని ఆయన సూచించారు. ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి నమాజ్ చదివితే సరిపోతుందని ఆయన వివరించారు. ఈ మేరకు అందరూ కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గైడ్లైన్స్ను పాటించాలని చెప్పారు. కరోనా వైరస్ కట్టడికి ప్రతీ ఒక్కరు లాక్డౌన్ నిబంధనలను పాటించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలని కోరారు. కేంద్రం ఇచ్చిన గైడ్లైన్స్ను పకడ్బందీగా అమలు చేసే బాధ్యత వక్ఫబోర్డులకు అప్పగించారని తెలంగాణ వక్ఫ్బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం పేర్కొన్నారు.