కరోనా వైరస్తో అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలం అవుతోంది. ఆ దేశంలో కరోనా పాజిటివ్ కేసు లు లక్షలకు చేరువయ్యాయి. జాన్ హోప్కిన్స్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం ఆదివారం నాటికి 9,64,937 కేసులు నమోదుకాగా, 54,841 మంది మృతి చెందారు. ఇక ప్రపంచంలో కరోనా కేసులు 30 లక్షలు దాటాయి. ఇందులో మూడింట ఒక వంతు అమెరికాలోనే నమోదు కావడం గమనార్హం. ప్రపంచ దేశాల్లో 2.07 లక్షల మరణాలు నమోదుకాగా, పావు శాతం మంది మృతులు అమెరికా వారే ఉన్నారు. న్యూయార్క్, న్యూజెర్సీలోనే వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. మొత్తం మరణాల్లో సగం మంది మృతులు (28 వేల మంది), మొత్తం కేసుల్లో పాతిక శాతం (నాలుగు లక్షలు) న్యూయార్క్, న్యూజెర్సీలోనే నమోదయ్యాయి.
కాగా, పరిస్థితి ఇంత దారుణంగాఉండగానే.. వాణిజ్య కార్యకలాపాల్ని తిరిగి ప్రారంభించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉన్న జార్జియా, ఓక్లాహామా, అలస్కా తదితర రాష్ర్టాల్లో ఆంక్షల్ని సడలిస్తున్నారు. ఇక ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ అధికారంలో ఉన్న న్యూయార్క్, మిషిగాన్ రాష్ర్టాల్లో మే మూడో వారం వరకు ఆంక్షలు కొనసాగుతాయని రాష్ర్టాల గవర్నర్లు వెల్లడించారు. ఈ పరిణామాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.