పశ్చిమబెంగాల్లో కరోనా వైరస్ తీవ్ర రూపందాల్చుతోంది. నిన్న వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారి కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా.. కోల్కతాలో మరో వైద్యుడు మృతి చెందారు. ఏప్రిల్ 17వ తేదీ నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ సిషీర్ మొండల్ (69) సోమవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనతో వైద్యవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేవలం 24గంటల వ్యవధిలోనే ఇద్దరు డాక్టర్లు మృతి చెందడంతో అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా బారినపడుతున్న వైద్యసిబ్బంది సంఖ్య పెరుగుతోంది.
నిన్న ఢిల్లీలోని మాక్స్ ఆస్పత్రిలో ఏకంగా 35మంది వైద్యసిబ్బంది కరోనా బారినపడ్డారు. ముంబైలో కూడా కొవిడ్-19 బారినపడ్డ వైద్య సిబ్బంది ఎక్కువగానే ఉంది.ప్రాణాలకు తెగించి కరోనా బాధితులకు వైద్యసేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లకు వైరస్ సోకుతోంది. ఈ పరిణామాలతో వైద్య కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. వైద్యసిబ్బంది పీపీఈ కిట్లు ధరించి, అన్నిరక్షణ చర్యలు తీసుకుంటున్నా.. వైరస్ సోకుతుండడం గమనార్హం.