కేంద్రానికి నిమ్మగడ్డ రాసిన వివాదాస్పద లేఖ వ్యవహారంలో కీలక మలుపు.. సీఐడీ ఎంట్రీ ఇవ్వడంతో ఈ వ్యవహారం మరింత ఉత్కంఠ రేపుతోంది. ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్కు సీఐడీ ఉచ్చు బిగించడం ఖాయంగానే కనిపిస్తోంది. అసలు ఆ లేఖ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు ఇఫ్పటివరకూ ఏపీలోనే విచారణ జరిపిన సీఐడీ.. తాజాగా హైదరాబాద్ కేంద్రంగా విచారణ చేపట్టనుండడంతో ఏం జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆయన పీఎస్ను విచారిస్తున్న అధికారులు.. త్వరలో నిమ్మగడ్డ వాదన కూడా రికార్డు చేసే అవకాశమున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు లభ్యమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే నిమ్మగడ్డకు పీఎస్ గా వ్యవహరించిన సాంబమూర్తిని ఇప్పటికే ఓసారి విజయవాడలో ప్రశ్నించిన సీఐడీ.. తాజగా హైదరాబాద్ కు తీసుకెళ్లి మరీ ప్రశ్నిస్తుండటంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి.
నిజానికి.. నిమ్మగడ్డ రమేశ్కుమార్ ఆ లేఖరాయలేదని, అది బయటి నుంచి మెయిల్ ద్వారా ఆయనకు చేరిందని ఇప్పటికే సీఐడీ గుర్తించినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా.. లేఖను కేంద్రానికి పంపిన తర్వాత ఆధారాలను ధ్వంసం చేయడంలో మర్మం ఏమిటన్న దానిపై సీఐడీ ఆరా తీస్తోంది. కేంద్రానికి రాసిన లేఖ బయటి నుంచి ఎవరు పంపారో తెలుసుకునేందుకు ఐపీ అడ్రస్ ల ట్రేసింగ్ కొనసాగుతోంది. అందుకే రమేశ్కుమార్ పీఎస్ సాంబమూర్తి నోటితోనే ఈ విషయాలను చెప్పించాలని సీఐడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.