దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో చాప కింద నీరులా కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు కరోనాను కట్టడి చేయడం సాధ్యం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన ప్రజారోగ్య నిపుణులు భారత్ లో సెప్టెంబర్ రెండో వారం లోపు కరోనా పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తుందని చెబుతున్నారు.
మన దేశంలో కరోనా కేసులకు సంబంధించి మార్చి 1 నుంచి మే 19 కాలపు గణాంకాలను బైలీ మేథమెటికల్ మోడల్లో విశ్లేషించి వారు ఈ విషయం చెప్పారు. ఇన్ఫెక్షన్ సోకిన వారి సంఖ్య... కోలుకున్నవారు, మరణించిన వారి సంఖ్య సమాన స్థాయికి చేరితే వైరస్ వ్యాప్తి మలిదశకు చేరినట్టు భావించాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అనిల్ కుమార్, డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ రూపాళీ రాయ్ ఈ నివేదికను రూపొందించారు. ‘ఎపిడెమియాలజీ ఇంటర్నేషనల్’ జర్నల్లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి.