గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబాయి తడిసిముద్దయింది. భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో బయటకు వెళ్లవద్దంటూ ప్రజలకు హెచ్చరిక జారీ అయింది. ఇప్పటికే కరోనా వైరస్ తో అల్లాడుతున్న జనానికి భారీ వర్షాలు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుంది. ముంబై లో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చొరబడింది. రోడ్లపై మోకాలు లోతు నీళ్లు చేరుకున్నాయి. భారీ వర్షాల కారణంగా ముంబైలోని రెండు ఇండ్లు కుప్పకూలిపోయాయి.
ఈ ప్రమాద ఘటనలో మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, విపత్తు బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాలను తొలగించి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో చనిపోయిన మృతులకు మహారాష్ర్ట సీఎం ఉద్ధవ్ థాకరే సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి