రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు రోజులు ప‌ర్య‌టించ‌నున్నారు. సిమాల్లో ఉన్న రాష్ట్ర‌ప‌తి నివాసంలో  ప‌నిచేస్తున్న న‌లుగురు ఉద్యోగుల‌కు క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో ఆయ‌న ప్ర‌యివేటు హోటల్‌లో బ‌స చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. త‌న నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా హిమాచ‌ల్ అసెంబ్లీ ప్ర‌త్యేక స‌మావేశంలో ప్ర‌సంగించ‌నున్నారు. అనంత‌రం నేషనల్ అకాడమీ ఆఫ్ ఆడిట్ అండ్ అకౌంట్స్‌లో ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ వేడుక‌ల‌కు రామ్‌నాథ్ కోవింద్ హాజ‌రుకానున్నారు. సిమ్లా శివార్లలోని ఛారాబ్రాలో ఉన్న రాష్ట్రపతి నివాసంలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు కరోనా సోకడంతో సిసిల్ హోటల్ లో బస చేస్తారని అధికారులు వెల్ల‌డించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాకుండా, మాజీ ముఖ్యమంత్రులు శాంత కుమార్, ప్రేమ్ కుమార్ ధుమాల్‌తో సహా 93 మంది మాజీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్ర‌త్యేక సెషన్‌కు హాజరు కావడానికి అంగీకారం తెలిపిన‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన ఐదుగురు ఎంపీలు, ఏడుగురు మాజీ ఎంపీలు కూడా హాజ‌రుకానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: