ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ఖేరికి నేతలెవరూ వెళ్లకుండా అక్కడి ప్రభుత్వం అడ్డుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే చత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ను లక్నో ఎయిర్పోర్టులో అక్కడి పోలీసులు అడ్డగించారు. దీంతో ఆయన అక్కడే నేలపై బైఠాయించారు. ఎయిర్పోర్టు నుంచి బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీనిపై భగేల్ స్పందిస్తూ తాను లఖింపూర్ఖేర్ వెళ్లడంలేదని తెలిపారు. ఎటువంటి ఆదేశాలు లేకుండా ఒక ముఖ్యమంత్రిని పోలీసులు అడ్డుకున్నారన్నారు. ఆదివారం ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ప్రసాద్ మౌర్య పర్యటన ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని కోరుతూ అక్కడి రైతులు ఆందోళనకు దిగారు. ఈలోగా ఒక వాహనం ఆందోళన చేస్తున్న రైతులపై నుంచి దూసుకువెళ్లడంతో నలుగురు రైతులు అక్కడికక్కడే మృతిచెందారు. దీనిపై తీవ్ర ఆగ్రహానికి గురైన రైతులు తీవ్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. దీనిపై ఇంతవరకు కేంద్రంకానీ, రాష్ట్రంకానీ స్పందించలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి