దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. నేడు బుధువారం అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు, ఆర్‌బీఐ సమీక్ష నేపథ్యంలో నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు.. చాలా సేపు ఒడుదొడుకుల్లోనే కొనసాగాయి. అయితే అమెరికా - చైనా మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం జరగనుందనే సానుకూల అంచనాలు మార్కెట్‌ ను నిలబెట్టాయి. 

                      

దీంతో పాటు చివరి గంటల్లో కీలక రంగాల షేర్లలో జరిగిన కొనుగోళ్ల అండతో ట్రేడింగ్‌లో సూచీలు లాభాలను దక్కించుకున్నాయి. ఇవాళ్టి సెషన్‌లో సెన్సెక్స్‌ 175 పాయింట్లు లాభపడి 40 వేల 850 పాయింట్ల దగ్గర స్థిరపడింది. నిఫ్ట్ 49 పాయింట్ల లాభంతో 12 వేల 43 పాయింట్ల దగ్గర ట్రేడింగ్ ముగిసింది. 

                      

అదేసమయంలో ఎల్అండ్‌టీ, రిలయన్స్, కోల్ ఇండియా, ఐఓసీ, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు నష్టపోయాయి. రిలయన్స్ దాదాపు 2 శాతం పడిపోయింది. అయితే నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే క్లోజయ్యాయి. నిఫ్టీ మెటల్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీఐటీ, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్‌లు 1 శాతానికి పైగా పెరిగాయి. 

                           

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 1.96 శాతం పెరుగుదలతో 62.01 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 1.75 శాతం పెరుగుదలతో 57.08 డాలర్లకు ఎగసింది. కాగా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి లాభాల్లో ట్రేడవుతోంది. 15 పైసలు లాభంతో 71.53 వద్ద కదలాడుతోంది. ఏది ఏమైనా చివరికి నేడు స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: