దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ- టీఎస్‌ఆర్టీసీకి భారీ స్థాయిలో ఆదాయం సమకూరింది. పండుగలకు సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికులతో బస్టాండ్లు కిటకిటలాడాయి. ఈనెల 8 నుంచి 18వ తేదీ వరకు రూ. 111.91 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. కేవలం టికెట్ల రూపంలోనే ఈ ఆదాయం వచ్చింది. ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డగోలు దోపిడీ చేస్తుండటంతో ప్రజలు ఆర్టీసీనే నమ్ముకున్నారు. దీంతో ఈ నెల 18వ తేదీ ఒక్కరోజే రూ. 14.79 కోట్ల ఆదాయం సమకూరినట్లు సజ్జనార్ వెల్లడించారు. సోమవారం ఒక్కరోజే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్సులు 36.3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు ఆయన తెలిపారు.

పండుగల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు తెలంగాణ, ఏపీలతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు ప్రయాణం సాగించాయి. కాగా పండుగకు ముందు.. అంటే ఈనెల ఒకటో తేదీ నుంచి 7వ తేదీ వరకు రోజువారీ సగటు ఆదాయం రూ. 9.70 కోట్లుగా ఉండగా.. పండుగ రోజుల్లో సగటున రోజువారీ ఆదాయం రూ. 10.17 కోట్లకు చేరింది. ఈ పది రోజుల్లో మొత్తం 2.80 కోట్ల మంది ప్రయాణికులను చేరవేవేసింది టీఎస్‌ఆర్టీసీ. ఆక్యుపెన్సీ రేషియో 63.19గా నమోదైంది.

తెలంగాణ ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరగా.. ప్రత్యేక బస్సులతో రూ. 8 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే దసరా ప్రత్యేక బస్సుల ద్వారా రూ. 5 కోట్లు ఆదాయం రాబట్టాలని ముందుగా అధికారులు అంచనా వేశారు. కానీ అంచనా వేసిన దానికంటే రూ.3 కోట్లు అధికంగా వచ్చాయి. గతంలో పండుగల సందర్భంగా నడిపించే ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేసేవారు. దీంతో చాలా మంది ప్రయాణికులు సొంత, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించేవారు. కానీ ఈసారి మాత్రం ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ చార్జీలనే వసూలు చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు ముందస్తుగానే ప్రకటించారు. అందుకే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తిరుగు ప్రయాణంలోనూ ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిటకటలాడుతున్నాయి.

మరోవైపు రాష్ట్రంలోని అన్ని బస్టాండ్‌లలో అధిక ధరలకు తినుబండారాలు విక్రయిస్తున్న దుకాణాలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణదారులకు నోటీసులు పంపారు. అలాగే ఉచిత మరుగుదొడ్ల వద్ద ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేసిన వారికి కూడా జరిమానాలు విధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: