ఇటీవలి కాలంలో మనుషుల్లో మానవత్వం కనుమరుగైపోయింది. ఈ క్రమంలోనే పరాయి వాళ్ళ విషయంలోనే కాదు సొంత వాళ్ల విషయంలో కూడా కాస్తయినా జాలి దయ చూపించడం లేదు. ఈ క్రమంలోనే కడుపున పుట్టిన వారిని కన్న వారిని కూడా దారుణంగా హత్య చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి.  చిన్న కారణాలకే ఏకంగా సొంత వారి ప్రాణాలు తోడేస్తోన్న ఘటనలు సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. రెండో పెళ్లి చేయడం లేదు అనే కోపంతో ఏకంగా కన్నతల్లినీ నరికి చంపాడు కొడుకు. ఈ దారుణ ఘటన కామారెడ్డి జిల్లా మద్దూరు మండలం మొగ గ్రామంలో వెలుగుచూసింది.


 ఇస్మాయిల్ బి, మహబూబ్ సాబ్ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు అల్లాఉద్దీన్ గ్రామంలో వేరే ఇంట్లో భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు. కొడుకు సలావుద్దీన్ తల్లిదండ్రులు తో కలిసి ఉంటున్నాడు. 8 ఏళ్ళ క్రితం సల్లావుద్దీన్ వివాహం జరుగగా రెండేళ్ల క్రితం భార్య గుండెపోటుతో మరణించింది. హైదరాబాద్ నగరంలో కొన్నాళ్లపాటు కూలి పని చేసి రెండు నెలలు క్రితం తన సొంత గ్రామం వచ్చి తల్లిదండ్రులతో ఉంటున్నాడు. ఇక్కడ దినసరి కూలీగా పని చేస్తున్నాడు. మద్యం తాగి వచ్చి తల్లిదండ్రులతో ఏదో ఒక విషయంపై గొడవ పడుతూ ఉండేవాడు.


 ఇటీవల తనకు రెండో పెళ్లి చేయాలి అంటూ తల్లిదండ్రులతో గొడవపడి బయటికి వెళ్లాడు. రాత్రి మద్యం తాగి వచ్చి ఇంట్లో నిద్రిస్తున్న తల్లి నీ మెడపై గొడ్డలితో దారుణంగా నరికి హత్య చేశాడు. ఇక హత్య చేసిన అనంతరం భయాందోళనకు గురయ్యాడు. తల్లినీ దొంగలు హత్య చేసి పారిపోయారు అంటూ గట్టిగా వాదించడం మొదలు పెట్టాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. కానీ పోలీసులు అనుమానం వచ్చి తనదైన శైలిలో విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.  ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: