అగ్ని ప్రమాదాలు అనూహ్యంగా సంభవించే భయంకరమైన సంఘటనలు. అవి భారీగా ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీస్తాయి. అయితే, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి చాలా వరకు ప్రమాదాలను అరికట్టగలరు. అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బాధితులను రక్షించడానికి దగదగ మండే మంటలను కూడా లెక్క చేయరు. వారు చేసే సాహసాలకు సంబంధించి ఇప్పటికే ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారాయి.

తాజాగా, ఈ కోవకు చెందిన మరో వీడియో వైరల్ గా మారింది. ఇందులో గ్యాస్ సిలిండర్ లీకు కావడం వల్ల మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. అయితే అది మనుషుల ప్రాణాలను తీసేయకముందే దానిని ఆర్పేసేందుకు పోలీసు కానిస్టేబుల్ రంగంలోకి దిగారు అంతేకాదు విజయవంతంగా దానిని ఆర్పేసి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే ఇటీవల మధ్యప్రదేశ్‌లోని భింద్‌ సిటీలో ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్‌ అయింది. క్షణాల్లోనే ఆ గ్యాస్ కి మంటలు చాలా ఎత్తుగా ఎగిసిపడ్డాయి. కన్ను మూసి తెరిచేలోపు ఇల్లంతా మంటల మాయం కావడంతో ప్రాణాలను రక్షించుకునేందుకు ఆ ఇంటిలోని వారు పరుగులు తీశారు. భింద్ పోలీస్ స్టేషన్‌కు మాచారం అందించగా ఒక కానిస్టేబుల్ మంటలను ఆర్పివేసేందుకు హుటాహుటిన ఘటన స్థలానికి చేర్చుకున్నారు. మంటల తీవ్రతను తగ్గించేందుకు గోన సంచులను వాడారు.

తరువాత కానిస్టేబుల్ ఒక కర్రతో సిలిండర్ రెగ్యులేటర్‌ స్విచ్‌ను ఆఫ్ చేయడానికి యత్నించాడు, కానీ అది కూడా పని చేయలేదు. అప్పటికే మంటలు మరింతగా వ్యాపించాయి. అయినా అతడు ధైర్యం చేసి సిలిండర్‌పై నీళ్లు కుమ్మరించాడు. అనంతరం కింద పడిపోయిన దానిని చేత్తో పట్టుకుని పైకి నిలబెట్టి మళ్లీ నీళ్లు పోసి చివరగా రెగ్యులేటర్ స్విచ్ బంద్ చేశాడు. అలా మంటలు ఆర్పడంతో ఇంటిలో ఉన్నవారు భద్రంగా బయటపడ్డారు. కానిస్టేబుల్ తెలివిగా వ్యవహరించడంతో ప్రమాదం పెద్దగా జరగలేదు.

కానిస్టేబుల్ చేసిన పనిని చాలామంది మెచ్చుకుంటున్నారు. అతని చర్య వల్ల ఇంటిలో ఉన్నవారు భద్రంగా బయటపడ్డారు. అతని సున్నితమైన, చురుకుగా వ్యవహరించిన తీరు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: