టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డిపై రేవంత్ మాస్ట‌ర్ ప్లాన్ వేశారా..? సంగారెడ్డిలో ఈనెల‌లో స‌భ నిర్వ‌హించి త‌న బ‌లం చూపాల‌నుకుంటున్న జ‌గ్గారెడ్డికి ఆ అవ‌కాశం లేకుండా చేయాల‌ని వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారా..? అంటే పార్టీ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానం ఇస్తున్నాయి. ఈనెల 21న సంగారెడ్డిలో ఆ ప్రాంత ఎమ్మెల్యే తూర్పు జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి  బ‌హిరంగ స‌భ నిర్వ‌హిస్తున్నారు. ల‌క్ష మందితో స‌భ నిర్వ‌హించి బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న చేయాల‌ని ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గ నేత‌ల‌కు సూచించారు. జ‌న సమీక‌ర‌ణ చేయాల‌ని కార్య‌క‌ర్త‌ల‌కు సందేశం పంపించారు.

కాంగ్రెస్ పార్టీలో త‌న‌కు అవ‌మానాలు జ‌రుగుతున్నాయ‌ని.. టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోక‌డ‌లు పోతున్నార‌ని జ‌గ్గారెడ్డి ఆరోపిస్తున్నారు. రేవంత్ ప‌గ్గాలు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచీ పార్టీకి దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. రేవంత్ అభిమానులు సోష‌ల్ మీడియాలో త‌న‌పై దుష్ఫ్ర‌చారం చేస్తున్నార‌ని దుయ్య‌బ‌డుతున్నారు. పార్టీ అధ్య‌క్షుడిగా రేవంత్ దీనిని అడ్డుకోలేక‌పోతున్నార‌ని.. ఇలాగైతే సీనియ‌ర్ల‌కు న్యాయం చేయ‌లేర‌ని చెబుతున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల‌ని జ‌గ్గారెడ్డి నిర్ణ‌యించుకున్నారు. ల‌క్ష మందితో స‌భ నిర్వ‌హించి కార్య‌క‌ర్త‌ల అభిప్రాయాలు సేకరించి రాజ‌కీయంగా ముంద‌డుగు వేయాల‌ని భావిస్తున్నారు.

అయితే ఇదంతా జ‌గ్గారెడ్డి పార్టీని బెదిరించ‌డానికే చేస్తున్నార‌ని.. ఆయ‌న‌కు రాజీనామా చేయాల‌నే ఉద్దేశం లేద‌ని ఆయ‌న వ‌ర్గీయులు చెబుతున్నారు. పార్టీలో త‌న‌కున్న ఇబ్బందుల‌ను సోనియాగాంధీ, రాహుల్ గాంధీల‌తో చ‌ర్చిస్తాన‌ని వారితో అపాయింట్మెంట్ ఇప్పించాల‌ని జ‌గ్గారెడ్డి కోరుతున్నారు. బ‌హిరంగ స‌భ‌కు వారిని కూడా ఆహ్వానించాల‌ని నిర్ణయించారు. అయితే.. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో ఘోరంగా దెబ్బ‌తిని తీవ్ర నిరాశ‌లో ఉన్న సోనియా, రాహుల్ ఈ స‌భ‌కు వ‌చ్చే అవ‌కాశ‌మే లేదు. మ‌రి జ‌గ్గారెడ్డి ఏ ధీమాతో స‌భ నిర్వ‌హ‌ణ‌కు ముందుకు వెళుతున్నారో అంతుబ‌ట్ట‌డం లేద‌ని పార్టీ శ్రేణులు చ‌ర్చించుకుంటున్నాయి.

జ‌గ్గారెడ్డి స‌భ‌కు పార్టీలోని ఇత‌ర సీనియ‌ర్లు ఎవ‌రైనా హాజ‌ర‌వుతున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ ప‌రిణామాల‌న్నింటితో సంబంధం లేకుండానే రేవంత్ ఒక ప్ర‌ణాళిక ర‌చించార‌ట‌. జ‌గ్గారెడ్డి అనుకున్న విధంగా స‌భ పెట్టి బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌కే సిద్ధం అయితే, ఆయ‌న‌కు పేరు రాకుండా రేవంతే ఈ స‌భ‌కు స్వ‌యంగా హాజ‌రై కార్య‌క్ర‌మాన్ని హైజాగ్ చేయాల‌ని.. అది పార్టీకి ఉప‌యోగం ఉండేలా చేసుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌. ఇదే జ‌రిగితే జ‌గ్గారెడ్డి గొంతులో ప‌చ్చి వెల‌క్కాయ ప‌డ్డ‌ట్లే. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!

మరింత సమాచారం తెలుసుకోండి: