ప్రపంచంలో నేడు ఏం జరుగుతోందో ఇంట్లో కూర్చుని ప్రజలు నిశ్చితంగా చూస్తున్నారు. ప్రపంచ విశేషాల సమాహారాన్ని అరచేతి లోనే వీక్షిస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా.. వెనువెంటనే వీక్షిస్తున్నారు. అదేసమయంలో కరోనా వంటి మహమ్మారి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో.. ఎలా వ్యవహరించాలో.. కూడా తెలుసుకుంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వా ల నుంచి తమకు అందుతున్న సూచనలను, సలహాలను వెనువెంటనే తెలుసుకుంటున్నారు. ప్రభుత్వాల నుంచి అందుతున్న సాయాన్ని కూడా తెలుసుకుని అందుకుంటున్నారు. అదే సమయంలో వారికి జరుగుతున్న అన్యాయాలను కూడా ప్రభుత్వా లకు వెనువెంటనే చేరవేస్తున్నారు.
మరి ఇదంతా ఎలా సాధ్యమవుతోంది? ప్రస్తుతం లాక్డౌన్తో మన అనుకున్నవారి ఇంటికి కూడా మనం వెళ్లలేక పోతున్నాం కదా? మరి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న విషయాలు మనకు ఎలా తెలుస్తున్నాయి? మనం ఓట్లు వేసి గెలిపించిన నాయకుడు కూడా మన ఇంటికి రావడం లేదు. కనీసం మన వీధికి కూడా రావడం లేదు (ఏమో ఒకరిద్దరు వస్తున్నారు!) కదా.. మరి మన సమస్యలు ప్రభుత్వానికి ఎలా చేరుతున్నాయి? వారధి ఎవరు? అంటే తడముకోకుండా చెప్పే మాట మీడియా ఉందికదా!? అని! నిజమే. మీడియా అంటే.. అది ఒక వస్తువు కాదు. మనుషులే! మీడియాలో పనిచేస్తున్నది కూడా మనలాంటివారే! వారికీ కరోనా ఎఫెక్ట్ పొంచే ఉంది. వారిపైనా అనేక నిషేధాజ్ఞలు ఉన్నాయి. పోలీసుల నుంచి బెదిరింపులు ఉన్నాయి. లాఠీల భయం కూడా పొంచే ఉంది.
అయినా.. వారు ఎంచుకున్న వృత్తి ధర్మానికి పాత్రికేయులు పాటు పడుతున్నారు. అందుకే ప్రజలకు ఇంట్లో ఉన్నా.. ప్రపంచం మొత్తం వారికి చేరువ అవుతోంది. దేశంలో ఏ క్షణాన ఎన్ని కరోనా కేసులు నమోదవుతున్నాయో.. ప్రభుత్వం చెబుతోంది. అయితే, దీనికి కారణాలు ఏంటి? ఎక్కడెక్కడ కరోనా విజృంభించే అవకాశం ఉందనే విషయాలపై సమగ్ర పరిశోధనాత్మకంగా సమాచారం ఇస్తూ.. పాత్రికేయులు ఇంత ఘోర కరోనా కాలంలోనూ తమ వృత్తి ధర్మానికి కట్టుబడ్డారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నిజానికి సమాజంలో ఏం జరుగుతోందో చెబుతున్నప్పటికీ.. ఇంత శ్రమ తీసుకుంటున్నప్పటికీ.. పాత్రికేయులను గుర్తించేవారు.. వారి పేరును స్మరించేవారు ఒక్కరంటే ఒక్కరు ఒక్క ప్రభుత్వం అంటే ఒక్క ప్రభుత్వం కూడా లేదంటే నమ్మితీరాలి.
కేంద్ర ప్రభుత్వం వైద్యులకు, వైద్య సిబ్బందికి .. ఆయుష్మాన్ భారత్ కింద 50 లక్షల బీమా ఇచ్చింది. కానీ, అదే వాతావరణంలో అదే ఆసుపత్రుల్లో పనిచేస్తూ.. వార్తలు సేకరిస్తున్న పాత్రికేయుల పరిస్థితి ఏంటి? వారికి కనీస అవసరాలు తీర్చేవారు ఎవరు? మాస్కులు లేవు. సంస్థలు ఇవ్వవు. కనీసం వారికి సమయానికి ఆహారం కూడా లేదంటే.. నమ్ముతారా? అయినా ఇది పచ్చినిజం. మనం ఇంట్లో ఉండి సమయానికి అన్నీ వండుకుని తింటున్నాం. ఉదయాన్ని వెళ్లి మనకు అవసరమైన వాటిని తెచ్చుకుంటున్నాం. మరి జర్నలిస్టు కుటుంబాలు ఇలా చేస్తున్నాయా? ఉదయాన్ని పుస్తకం పెన్ను పట్టుకుని ఫీల్డ్ లోకి వెళ్తున్న జర్నలిస్టు.. ఎప్పుడు ఇంటికి వస్తాడో చెప్పలేని పరిస్థితి!
ఎలా వస్తాడో కూడా తెలియని పరిస్థితి!! అయినా ఆయనను స్మరించేవారు లేరు. ఇతర వర్గాలైన పోలీసులు, వైద్యులను, మునిసిపల్ సిబ్బందిని పొగుడుతున్నారే తప్ప.. వీరంతా చేస్తున్న సేవలను మూడో నేత్రంతో చూస్తూ..ప్రజలకు అందిస్తున్న కీలక మైన సారధి..పాత్రికేయుడిని పట్టించుకునేవారు ఎవరు? మనం వారిని స్మరించుకోకపోతే..న్యాయం ఉందా? ఇప్పటికైనా ఓ సెల్యూట్ చేసి వారి రుణాన్ని తీర్చుకుందాం!! వారికీ కుటుంబాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేసుకుందాం.. వారికి కూడా అండగా నిలుద్దాం!!! మీ సోషల్ మీడియాను ఉపయోగించి జర్నలిస్టులకు సలాం! అంటూ ఒక్క వాక్యం.. ఒకే ఒక్కవాక్యం టైపు చేసి వారిలో కొండంత స్థయిర్యాన్ని నింపుదాం!
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple