రాజకీయాల్లో నిజాయితీ ఉండాలి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. నా కంఠంలో ప్రాణం ఉన్నా పోయినా.. ఫర్వాలేదు.. నేను మా త్రం నిజాయితీ రాజకీయాల్లోనే ఉంటాను- ఇదీ పార్టీ పెట్టిన సమయంలో జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్.. చేసిన పెద్ద ప్రకటన. అయితే, ఆయన తర్వాత కాలంలో వ్యవహరించిన తీరు అందరినీ జుగుప్సకు గురి చేసింది. ప్రశ్నిస్తానని, నిజాయితీ రాజకీయా లు చేస్తానని వచ్చిన పవన్.. ఇలా మారిపోవడం ఏంటని ముక్కున వేలేసుకున్నారు. చంద్రబాబుతోను, బీజేపీతోనూ చెలిమి చేశారు. తర్వాత అనూహ్యంగా ప్రత్యేక హోదా అస్త్రాన్ని తెరమీదికి తెచ్చి.. తన ఇమేజ్ పెంచుకున్నారు.
ఇంకేముంది.. పవన్ కు మంచి ఊపు వచ్చిందని అందరూ అనుకున్నారు. ఈలోగా ఏమైందో ఏమో.. చంద్రబాబుతోనూ వైరం పెట్టుకున్నారు. అప్పటి వరకు జగన్ను మాత్రమే టార్గెట్ చేసిన పవన్.. తర్వాత కాలంలో బీజేపీని లక్ష్యంగా చేసుకున్నారు. ఎన్నికలకు ముందు బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఏపీని అన్యాయం చేశారని, ఏపికి నిధులు కూడా ఇవ్వడం లేదని విమర్శలు గుప్పించారు. మొత్తంగా ఎన్నికల సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇక, ఎన్నికల్లో.. పవన్ ఘోరంగా ఓటమి పాలయ్యారు. అనంతరం మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. చంద్రబాబును పక్కన పెట్టి.. నేరుగా బీజేపీతో జత కట్టారు.
వాస్తవానికి ఏపీలో బీజేపీ ఎదిగేందుకు ఉన్న మార్గం.. వేరే అయినప్పటికీ.. పవన్తో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకో వ డం పెద్ద చిత్రం! ఇక, ఇప్పుడు బీజేపీని పొగడ్తలతో ముంచెత్తే పనిని చేస్తున్నారు పవన్. అదే సమయంలో తెలంగాణ సీఎంను కూడా కొనియాడుతున్నారు. అక్కడి ప్రజలకు సరైన సమయంలో కేసీఆర్ స్పందించి చర్యలు తీసుకున్నారు కాబట్టి.. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని పొగడ్తల వర్షం కురిపించారు. అయితే, ఇప్పుడు ఈ వ్యాఖ్యలే పవన్ను టార్గెట్ చేసేలా చేశాయి.
గత ఎన్నికల్లో పవన్తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లిన.. కమ్యూనిస్టులు విరుచుకుపడ్డారు. పవన్.. నాలిక తాటిమట్టా? అంటూ.. నిప్పులు చెరుగుతున్నారు. పేదల పక్షాన ఉంటానని చెబుతున్న పవన్.. కార్పొరేట్లకు వెన్నుదన్నుగా ఉన్న బీజేపీతో అంటకాగుతూ.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం భవిష్యత్తుకు మంచిది కాదని అంటున్నారు. ఇక, రాష్ట్రంలోనూ జనసేన నాయకులు మౌనం పాటిస్తున్నారు. మొత్తంగా పవన్ హవా పూర్తిగా తగ్గిపోయిందనే అంటున్నారు పరిశీలకులు.