ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజూ 20 వేలకుపైగా కేసులు వెలుగు చూస్తున్నాయి. రోజూ కనీసం 100 మంది వరకూ అధికారికంగానే  కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్ నిన్న ఒకే రోజు మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవి మూడూ కరోనా సమయంలో ప్రజలకు మేలు చేసే నిర్ణయాలే. వాటిలో మొదటిది.. కర్ఫ్యూ పొడిగింపు. కరోనా కట్టడి చర్యలో భాగంగా గత రెండు వారాలుగా అమలు చేస్తున్న కర్ఫ్యూను ఈనెలాఖరు వరకూ పొడిగిస్తూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా తగ్గుముఖం పట్టి సత్ఫలితాలు రావాలంటే కనీసం 4 వారాలు కర్ఫ్యూ అమలులో ఉండాలన్నారు.

రెండో కీలక నిర్ణయం... కరోనా కారణంగా అనాధలైన పిల్లను ఆదుకోవడం గురించి.  కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆ మేరకు తగిన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పేరు మీద కొంత మొత్తాన్ని డిపాజిట్‌ చేసి, దానిపై వచ్చే వడ్డీ ప్రతి నెలా వారి కనీస అవసరాలు తీర్చేలా ఆలోచన చేయాలని అధికారులను ఆదేశించారు. డిపాజిట్ చేసే మొత్తం రూ.10 లక్షలుగా ఉండొచ్చని చెబుతున్నారు. ఇదే నిజమైతే ఇది చాలా మంచి నిర్ణయం అవుతుంది.

మూడో కీలక నిర్ణయం.. బ్లాక్ ఫంగస్‌ చికిత్సను కూడా ఆరోగ్య శ్రీ ద్వారా ‌అందించడం. కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చి ఎంతోమంది నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలో చేరుస్తూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం  డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.

ఇవే కాకుండా కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, ఆస్పత్రుల్లో వైద్య సేవలు, శానిటేషన్, ఆహారం, వ్యాక్సిన్‌ వంటి అంశాలపై సీఎం వైయస్‌ జగన్‌ నిన్న క్షుణ్ణంగా చర్చించారు. ఆక్సిజన్‌ కాన్‌సంట్రేటర్స్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో కూడా పెట్టాలని, తద్వారా ఆస్పత్రుల మీదపడే భారం కొంతైనా తగ్గుతుందని సీఎం సూచించారు. పాజిటివ్‌ పేషెంట్లకు సంబంధించిన కుటుంబీలకు కరోనా లక్షణాలు ఉంటే వారికి తక్షణ చికిత్స అందించాలనే లక్ష్యంగా ఫీవర్‌ సర్వే నిర్వహించాలన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: