
అయితే ఆరు నెలల క్రితం వైసిపి పుంజుకుంటుందన్న చర్చ వినిపించింది. దీనికి కారణం టిడిపి నాయకులు ఇసుక, మద్యం వంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం. ఈ అంశాలు చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో, ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులను ఆయన నేరుగా హెచ్చరించారు. మంత్రులను సైతం వదిలిపెట్టకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం వల్ల, పార్టీ ఇమేజ్ మళ్లీ మెరుగుపడిందని సర్వేలు చెబుతున్నాయి. ప్రభుత్వపరంగా సూపర్ సిక్స్ పథకాల అమలు, పెట్టుబడుల రాక, ఉపాధి కల్పన, డీఎస్సీ నిర్వహణ, ప్రతి నెలా ఒకటో తారీఖున పింఛన్ల పంపిణీ, పేదలతో సీఎం మమేకమయ్యే తీరు.. ఇవన్నీ ప్రజల్లో మంచి అభిప్రాయం కలిగించాయి. పార్టీ పరంగా ఎమ్మెల్యేల నియంత్రణ, ఆరోపణలు వచ్చిన వారిపై కఠిన వైఖరి, ప్రతి మూడు నెలలకు ఒకసారి పార్టీ పరిస్థితిని సమీక్షించడం వంటి చర్యలు చంద్రబాబుకు ప్లస్గా మారాయి.
సీనియర్ నాయకులకు ఆయన చెప్పిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రెండు రంగాల్లోనూ (ప్రభుత్వం, పార్టీ) అత్యంత జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎక్కడైనా చిన్న తప్పు జరిగినా బాధ్యులను కఠినంగా ప్రశ్నిస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్టీ గ్రాఫ్ అనుకూలంగా ఉందని, ఈ స్థితిని రాబోయే నాలుగేళ్లపాటు కొనసాగిస్తే మళ్లీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవచ్చని చంద్రబాబు నమ్ముతున్నారు.